టిడిపిలో కుంపటి: మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్, భూమాతోనే ఇబ్బంది
కర్నూలు: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో, కర్నూలు టిడిపిలో రసవత్తర రాజకీయం కనిపిస్తోంది. కెఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య చాలా రోజుల నుంచి రాజకీయ వైరం ఉంది.
భూమా చేరికకు ముందు కెఈ, శిల్పా వర్గీయుల మధ్య కర్నూలు జిల్లాలో పోటీ పోటీ కనిపించింది. భూమా నాగిరెడ్డి చేరిక తర్వాత ముగ్గురి మధ్య రాజకీయ పోరు కనిపిస్తోంది. ఈ ముగ్గురు నేతలు ఒకే గూటిలో ఉండటం కష్టమనే అభిప్రాయం మొదటి నుంచి వినిపించింది.
అయితే, శిల్పా సోదరులు, కెఈ వర్గం మధ్య ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. కానీ భూమా చేరికతో మాత్రం కర్నూలు టిడిపిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా మోహన్ రెడ్డి చెబుతున్నారు.
తాజాగా, శిల్పా సోదరుల అనుచరుడి పైన దాడి నేపథ్యంలో భూమాతో ఇటు శిల్పా సోదరులకు, అటు కెఈ సోదరులకు పొసిగేలా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ల పాటు కెఈ, శిల్పా వర్గీయులు అటో ఇటు కలిసి పని చేసుకుంటూ వెళ్తున్నారని, భూమా రాకతో గొడవలు ప్రారంభమయ్యాయంటున్నారు.
ఒకే ఒరలో.. ఇన్ని కత్తులు కలిసేనా?
భూమా నాగిరెడ్డి కుటుంబం గతంలో టిడిపిలో ఉన్నప్పుడు ఇతరుల కుటుంబం మరో పార్టీలో ఉండేది. ఇలా.. ఓ కుటుంబం ఓ పార్టీలో ఉంటే మరో కుటుంబం మరో పార్టీలోకి వెళ్లేది. ఇక్కడ పార్టీల కంటే నాయకుల హవానే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అయితే, గతంలో కత్తులు దూసుకున్న వారే ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. దీంతో కర్నూలు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గంగుల ప్రతాప్ రెడ్డి గతంలోనే టిడిపిలో చేరారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ చేరారు. ఒకే పార్టీలో ఇంతమంది చేరడంతో... మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలేచాయని అంటున్నారు.
మరోవైపు శిల్పా సోదరులు (శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి)లు కూడా జిల్లాలో చక్రం తిప్పుతుంటారు. ఇలా అందరు సైకిల్ ఎక్కడంపై జిల్లాలో ఆసక్తికర చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి కెఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తంగా కర్నూలు టిడిపిలో కీలక నేతల తీరు ఆసక్తిని రేపుతున్నాయంటున్నారు.
చంద్రబాబుకు ఫిర్యాదు
భూమా నాగిరెడ్డి పైన శిల్పా మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూమా వల్లే తనకు సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబుకు గోడు వెళ్లబోసుకున్నట్లు చెప్పారు. భూమా ఫ్యామిలీ చేరినప్పటి నుంచే జిల్లా రాజకీయాలలో గొడవలు ప్రారంభమయ్యాయన్నారు.
భూమా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవ జరగలేదని చంద్రబాబుకు వివరించానని చెప్పారు. భూమా అక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
తమ సోదరులు టిడిపిలో లేకుండా చేయాలని భూమా చూస్తున్నారన్నారు. జిల్లాలో కెఈ కృష్ణమూర్తితో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. భూమాతోనే ఇబ్బందులు అన్నారు. భూమా తీరు ఇలాగే ఉంటే కలిసి పని చేయడం కష్టమన్నారు.
టిడిపిలో చేరాక భూమా తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. భూమా చేరికతో ఇబ్బందులు ఉంటాయని తాను ముందే చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. శిల్పా సోదరులు.. బాధిత కుటుంబాన్ని వెంట పెట్టుకొని చంద్రబాబు వద్దకు వచ్చారు.