మీ బస్సు విలువ కాదా!?: చంద్రబాబుకు లేఖ రాసి, రైతు ఆత్మహత్య
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన వారం రోజుల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు సాయం చేయాలని కోరిన ఓ పొగాకు రైతు... ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రాణాలను కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పశ్చిమ గోదావరి జిల్లా యర్నగూడెంకు చెందిన సింహాద్రి వెంకటేశ్వర రావు (49) ఇటీవల లేఖ రాశారు.
అనంతరం, అప్పుల బాధతో పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో, ఆయన ఈ ఘటనకు పాల్పడడానికి ముందు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

ఏపీ సీఎం ప్రాణరక్షణ కోసం రూ. 5.5 కోట్లు వెచ్చించి ఏపీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సును తయారు చేయించిందని, అదే తరహాలో పొగాకు రైతుల ప్రాణరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు బస్సు కంటే పొగాకు రైతులు ముఖ్యం కాదా అని లేఖలో ఆయన ప్రశ్నించారు.
పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారి కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతోందంటూ సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 2015-16 సీజనుకు పొగాకు పంట పరిమితిని 25 క్వింటాళ్లకు తగ్గించడాన్ని కూడా తప్పుపట్టారు.
ఒక్కో బ్యారనుకు రూ.9లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ఇస్తే రైతులు తమ పొగాకు బ్యారను లైసెన్సులను స్వచ్ఛందంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పొగాకు రైతులందరి కోసం తాను ఆత్మత్యాగానికి సిద్ధంగా ఉన్నానంటూ లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications