చంద్రబాబుకు ట్వీట్: పవన్ కళ్యాణ్కు రివర్స్, రైతుల్లో చిచ్చుపెట్టారా?
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా ట్వీట్లతో రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి ప్రాంతంలోని మూడు నాలుగు గ్రామాలను పేర్కొంటూ... అక్కడి భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించవద్దని పవన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మిగతా పలు గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తుళ్లూరు మండలంలోని పలువురు రైతులు పవన్ కళ్యాణ్ ట్వీట్లను తప్పుపడుతున్నారని చెబుతున్నారు. 98 శాతం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే, మిగిలిన రెండు శాతం భూములకు చట్టం నుంచి మినహాయింపు కోరడం బాధ్యతారాహిత్యమని అంటున్నారు.
రాజధాని నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని లింగాయపాలెం సర్పంచ్ చెప్పారు. 45 వేల మంది రైతుల త్యాగాలను మరచిపోయి, వంద మంది రైతులను వెనకేసుకొస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్కు రైతులపై ప్రేమ ఉంటే అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ చేయతలపెట్టిన భూసమీకరణ పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం మరోసారి స్పందించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి వరుస ట్వీట్లు చేశారు.
బలవంతంగా వద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని భూసేకరణ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆలోచించాలని కోరారు.
ఉండవల్లి, పెనుమాక, బేతపూడితో పాటు నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. పాలకులు రైతుల పట్ల వివేచనతో మెలగాలన్నారు. అభివృద్ధి కోసం జరిగే నష్టం ఎంత కనిష్టమైతే ఆ పాలకులు అంత వివేకులను వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications