అగ్ని ప్రమాదంపై దుమారం: తుళ్లూరు వెనుక బాబు, కాదు.. జగన్ కుట్ర!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు ప్రాంతంలో అగ్ని ప్రమాదం పైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. తుళ్లూరు, తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. లక్షల రూపాయల నష్టం జరిగింది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఒకరి పైన మరొకరు బురద జల్లుకుంటున్నారు.
ఈ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతల పైన అనుమానం ఉందని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. భయపెట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ప్రభుత్వం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. పంటలు పండే భూములను లాక్కోవాలని చూడటం, రైతులు ఎదురు తిరిగితే సర్కారు రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు.
చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా అని ప్రజలు అనుమానిస్తున్నారని ఆరోపించారు. ఘటన పైన గవర్నర్ వెంటనే స్పందించి కేంద్రానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు. తమకు పోలీసుల పైన నమ్మకం లేదన్నారు. కంటితుడుపు చర్యగా విచారణ జరిపితే సహించమన్నారు. అందరు సంతోషంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధానిని బలవంతంగా, అమానుషంగా వ్యవహరించి తీసుకోవడం సరికాదన్నారు. సంఘటన వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు, పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం పైన జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోందన్నారు. ఇడుపులపాయకు రాజధానిని తరలించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడన్నారు. జగన్ ప్రోద్భలంతోనే గ్రామాల్లో పంటలు తగులబెట్టారని ఆరోపించారు.
జగన్ మెప్పు కోసం కొందరు స్థానిక నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, జగన్ సైకోలా తయారయ్యాడని ధ్వజమెత్తారు. జగన్ డైరెక్షన్లో లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఇదంతా చేస్తున్నారని, సాయంత్రానికి ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారో తెలిసిపోతుందన్నారు. దుర్మార్గపు చర్యలు ఆపకుంటే తగిన ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరించారు. రాజధానిని అడ్డుకోవాలంటే పంటలు తగులబెట్టాలా అని ప్రశ్నించారు.
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి మండంలోని పలు గ్రామాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీంతో పొలాల్లోని పలు గుడిసెలు దగ్ధమయ్యాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అరటి తోటలకు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. రాజధానికి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల్లోనే అగ్నిప్రమాదాలు జరగటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే చేస్తున్నారని రైతులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం అందిన వెంటనే అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్ ఘటనా స్థలికి చేరుకుని దగ్దమైన పొలాలను పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో జరిగిన అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎలా జరిగింది, వాటికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను చంద్రబాబు ఆదేశించారు.
ఈ అగ్నిప్రమాదాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. పెనుమాక, ఉండవల్లి, మందడం, లింగాయపల్లి గ్రామాల్లో అరటి తోటలను దగ్ధం చేయడంపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందింది. ఈ ఘటనపై సీఆర్డీఏ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాంత్, కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.