టీడీపీ ఎంపీతో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి భేటీ- బెజవాడలో ఏం జరుగుతోంది ?
ఏపీ రాజకీయాల్లో విజయవాడ రాజకీయాలకు ప్రత్యేక స్ధానముంది. ఇక్కడ పార్టీలకు కట్టుబడి సాగే రాజకీయాలు ఏ స్ధాయిలో ఉంటాయో, పార్టీలకు అతీతంగా సాగే రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో ఉంటాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే తండ్రి నిన్న టీడీపీ ఎంపీ తండ్రిని కలవడంతో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వీరిద్దరి మధ్య భేటీ మామూలుదైతే ఎలాంటి ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఆ వైసీపీ ఎమ్మెల్యే అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉండటంతో ఇది కాస్తా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే..
బెజవాడ పాలిటిక్స్
ఏపీ వాణిజ్య రాజధాని బెజవాడలో మరోసారి రాజకీయం కాక రేపుతోంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందున్న రాజకీయానికి చెక్ పెట్టి ఇక్కడ కొత్త రాజకీయాన్ని తెచ్చామని సంబరపడుతున్న అధికార వైసీపీకి తాజా పరిణామాలు అస్సలు మింగుడు పడటం లేదు. ఇదే క్రమంలో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. అదే సమయంలో విపక్ష టీడీపీకి ఏమైనా పరిస్ధితి పూర్తిగా అనుకూలంగా ఉందా అంటే అదీ లేదు. కానీ ఈ మధ్యలో ఓ కీలక పరిణామం చోటు చేసుకోవడంతో ఇది నగర రాజకీయాలపై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
కేశినేని నానితో వసంత నాగేశ్వరరావు భేటీ
బెజవాడ రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. స్ధానిక టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వసంత నాగేశ్వరరావు కుమారుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనేక విషయాల్లో తండ్రి నిర్ణయాలతో విభేదిస్తున్నారు. దీంతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ సర్కార్ తీరుపై వసంత ఆక్రోశం
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ గతేడాది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది. అలాగే అమరావతి విషయంలోనూ వసంత నాగేశ్వరరావు బాహాటంగా తీవ్ర విమర్శలకు దిగారు. ఈ రెండు అంశాల్లో ఆయన వైసీపీలో ఉన్న తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ను ఇరుకునపెట్టేశారు. దీంతో వైసీపీ అధిష్టానం నుంచి కృష్ణప్రసాద్ కు ఫోన్లు రావడం, ఆయన తన తండ్రి వ్యాఖ్యల్ని ఖండించడం చకచకా జరిగిపోయాయి. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు ఆయనకు, తనకు సంబంధం లేదంటూ అప్పుడు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొట్టి పారేశారు.
టీడీపీలోకి వసంత కుటుంబం ?
ప్రస్తుతం అమరావతిలో రాజకీయం మారుతోంది. గత ఎన్నికల నాటి పరిస్దితులు కనిపించడం లేదు. ముఖ్యంగా అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తీసుకురావడమే కాకుండా విజయవాడలో అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారని వైసీపీ సర్కార్ ను విపక్షాలతో పాటు స్దానిక నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతికి మద్దతుగా పార్టీలకతీతంగా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నేతలు ఏకమవుతున్నారు. ఇదే క్రమంలో వసంత కూడా కేశినేని నానితో భేటీ అయి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టివ్ గా లేని వసంత నాగేశ్వరరావు తాజా వ్యాఖ్యలతో మాత్రం వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు కేశినేని నానితో భేటీతో టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారా అన్న చర్చ జరుగుతోంది. అసలే వైసీపీలో ఉక్కిరిబిక్కిరవుతున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకి ఫిరాయిస్తారన్న చర్చ జరుగుతోంది.