కూతురికి వాతలు: తుపాకి మిస్ఫైర్తో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోని నాయుడిపేటలో ఓ తండ్రి కన్నకూతురిని చిత్ర హింసల పాలు చేశాడు. శ్రీనివాసులు అనే వ్యక్తి తన రెండవ కూతురు కాసేపు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద కూతురు ఒంటిపై వాతలు పెట్టాడు. చిన్నారి అరుపులు గమనించిన స్థానికులు పాపను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు భార్య ఆరునెలల కిత్రం కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి కలెక్టరేట్లో తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రమేష్రెడ్డి అనే కానిస్టేబుల్ ట్రెజరీ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి అతడి ఛాతిలోకి గుండు దూసుకెళ్లింది. దీంతో రమేష్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు కడప జిల్లా వాసిగా తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మండలం చిన అమిరంలో విషాదం నెలకొంది. శనివారం తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులు రాణి(5), సోమేష్(3)గా తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెంలోని అమ్మవారి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ, అమ్మవారి ఆభరణాలను దుండగులు అపహరించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.