టీడీపీ వాళ్లు అడ్డొస్తే పొక్లెయిన్ తో తొక్కించేయండి... వైసీపీ నాయకుల దౌర్జన్యం... మీసం మెలేసిన సీఐ
ఒక ప్రయివేటు స్థలానికి సంబంధించిన వివాదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. టీడీపీ వర్గీయులు అడ్డొస్తే తొక్కించేయండంటూ వైసీపీ నాయకులు విరుచుకుపడటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఈ వివాదం చోటుచేసుకుంది. స్థలానికి సంబంధించిన యజమానులు, కొనుగోలుదారులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

సైదాపురం సమీపంలోని పొలంలో..
సైదాపురం సమీపంలోని పొలంలో సర్వే నెంబరు 41లో 6 ఎకరాల భూమిని యజమానులు 2016లో విక్రయించారు. ఆ స్థలాన్ని కొన్నవారు దాన్ని ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరిపారు. అయితే ఆ భూమి తమ తాతల ఆస్తి కావడంతో తమకు కూడా వాటా ఉందంటూ యర్రగుంటపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి ఆర్డీవో కోర్టుతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఇదే సర్వే నెంబరులో కుటాగూళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త గంగులప్ప 2016లో 12 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు.

రాజకీయపార్టీల నేతల చెంతకు చేరిన విషయం
అందులో బోరు తవ్వి ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సోమశేఖర్ కోర్టు వివాదంలో ఉండటంతో ఎటువంటి నిర్మాణం చేపట్టవద్దని సూచించారు. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. గంగులప్ప సన్నిహితులు కూడా తమ సమస్యను వెంకటప్రసాద్ కు వివరించారు. ఇరువర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ రెవెన్యూ అధికారులు సూచించారు. గంగులప్ప పొక్లెయిన్, టిప్పర్ తో స్థలం వద్దకు వచ్చారు. ఆయనకు తోడుగా వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చారు. మరోవైపు సోమశేఖర్ కు అనుకూలంగా కందికుంట తన అనుచరులతో కలిసి వచ్చారు. అప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాదం కాస్తా టీడీపీ, వైసీపీ వివాదంగా మారింది.

పగిలిపోయిన పొక్లెయిన్ అద్దాలు
ఎవరు అడ్డొచ్చినా తొక్కించుకుంటూ వెళ్లండంటూ పొక్లెయిన్ డ్రైవర్ కు వైసీపీ నాయకులు సూచించారు. పొక్లెయిన్ వేగంగా రావడంతో తెలుగుదేశం పార్టీ వర్గీయులు దానికి అడ్డుడా నిలబడ్డారు. అదే సమయంలో రెండువర్గాలు పరస్పరం రాళ్ళ దాడికి పాల్పడ్డాయి. పొక్లెయిన్ అద్దాలు దెబ్బతినడంతోపాటు ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

మీసం మెలేసిన అర్బన్ సీఐ మధు
విషయం తెలుసుకున్న ఎస్ ఐ, అర్బన్ సీఐ లు తమ సిబ్బందితో అక్కడికి వచచారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీఛార్జి చేశారు. అయితే తమను మాత్రమే లక్ష్యంగా చేసుకొని లాఠీఛార్జి చేశారంటూ తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఆరోపించారు. లాఠీఛార్జిని అడ్డుకోవడానికి వెళ్లిన కందికుంట వెంకటప్రసాద్ చేతికి గాయమైంది. దీంతో టీడీపీ వర్గీయులు ఆరోపణలు చేయడంతో ఆగ్రహంతో అర్బన్ సీఐ మధు ఊగిపోయారు. రండి తేల్చుకుందామంటూ మీసం మెలేశారు. ఉద్రిక్తత పెరుగుతుండటంత అదనపు బలగాలు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పంపించివేశాయి. దీనిపై సీఐ మధును వివరణ కోరగా పొక్లెయిన్ పై పెట్రోల్ పోసి కాల్చేస్తారనే పక్కా సమాచారం ఉండటంతోనే ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జి చేశామన్నారు.












Click it and Unblock the Notifications