తారాస్థాయికి విభేదాలు: గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ కరణం, లోకేష్ వద్దకు పంచాయతీ!
ప్రకాశం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు.. అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయిస్తే.. అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీ నిలిపివేయించారు కరణం బలరాం. కాగా, అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం వరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళితే.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్లు వ్యతిరేకించారు. అయినా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు.
అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆయన స్థానంలో గుంటూరు వీఆర్లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. కాగా, బేతపూడి ప్రసాద్ కరణం వర్గీయుడిగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు. ఐజీతో పాటు ఏకంగా డీజీపీపైనే ఒత్తిడి తెచ్చారు.
దీంతో ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు మరోసారి పతాకస్థాయికి చేరినట్లయింది.
తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్ టిడిపి కీలక నేత నారా లోకేష్ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సీఐని బదిలీ చేస్తే చేతకాని వాళ్లలా కూర్చోలేమని అటు చంద్రబాబుకు ఇటు లోకేష్లకు కరణం తేల్చి చెప్పినట్లు సమాచారం. పదేళ్లు జెండాలు మోసి కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డారని, విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కరణం తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో టిడిపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.