చంద్రబాబు అనుమానం: ఏపీ హోదాతో వచ్చేదేంటీ, ప్యాకేజీతో పోయేదేంటీ?
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ. కేంద్రం ఇస్తానంటోన్న ప్రత్యేక ప్యాకేజీపై ప్రతిపక్షాలు బంద్కు పిలుపునివ్వగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చేయగా, ఇవ్వకుండా తప్పించుకోలేరని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఏపీకి హోదాకు 'మించి' సాయం చేస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేంటి? ప్యాకేజీ వల్ల పోయేదేంటి? ఏమిటో తెలుసుకుందాం....

14వ ఆర్థిక సంఘం ఏం చెబుతోందంటే?
ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం కేంద్రం రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నుల్లో తిరిగి కొంత భాగాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద చెల్లిస్తుంది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక ప్రణాళిక వ్యయం ఊసెత్తడం మానేశారు. దీంతో హోదా ఉన్న రాష్ట్రాలకు అందే 30 శాతం నిధులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాల మధ్య పెద్దగా తేడా ఉండదు. ఇదే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం పేర్కొంది.

ఏపీకి ఐదేళ్లలో రూ. 22,500 కోట్లు కేటాయింపు
అంతేకాదు ఇప్పటి వరకు హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాలకు కూడా ఇకనుంచి ప్యాకేజీ మాత్రమే ఇవ్వాలని కేంద్రంలో ఆలోచన చేస్తోంది. దీనికి తోడు ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందిస్తోంది. ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలతో పాటు ఏపీ, బెంగాల్, కేరళకు కూడా ఈ నిధులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లలో రూ. 22,500 కోట్లు కేటాయించారు.

హోదా వల్ల రాష్ట్రానికి ప్రణాళిక వ్యయం కింద అదనపు నిధులు
వాస్తవానికి ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ప్రణాళిక వ్యయం కింద అదనంగా నిధులు అందుతాయి. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక నిధుల్లో 30 శాతాన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేశారు. మిగతా 70 శాతాన్ని మిగతా రాష్ట్రాలకు పంచుతారు. 1968 నుంచి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలున్నా 2002లోనే పన్ను రాయితీల అంశం తెరపైకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చారు. అది కూడా కేవలం ఐదు సంవత్సరాలపాటే.

దేశం మొత్తం ఒకే పన్ను రాయితీ
2005లో ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లకు పన్ను రాయితీలిచ్చారు. మొదట ఐదేళ్లపాటు ఇచ్చిన తర్వాత ఒకసారి ఐదేళ్లు, మరోసారి రెండేళ్లు చొప్పున పెంచారు. 2014 తర్వాత హోదా ఉన్న 8 రాష్ట్రాల్లో మినహాయింపులు ఆగిపోగా ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్ముకాశ్మీర్లకు 2017లో ఆగిపోనుంది. ఫలితంగా దేశం మొత్తం ఒకే పన్ను రాయితీ ఉంటుంది.

14వ ఆర్థిక సంఘం, చౌహాన్ కమిటీ ప్రకారం
14వ ఆర్థిక సంఘం, చౌహాన్ కమిటీ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా ఇక ‘ముగిసిన చరిత్ర' అని కేంద్రం వాదిస్తోంది. అందుకే హోదాకు సమానంగా సాయం చేస్తామని ప్రకటించింది. ఏపీకి ప్యాకేజీ ఐదేళ్లు పాటు కొనసాగుతుందని జైట్లీ ప్రకటించారు. ఫలితంగా ఏపీకి రుణం రూపంలో రూ.22,500 కోట్లు, మధ్యకాలిక రుణం(5-7)గా ర.22,500 కోట్లు కలిపి మొత్తం రూ.45వేల కోట్లు వస్తాయి. అయితే రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీకే విలువలేనప్పుడు, చట్టబద్ధత లేని జైట్లీ ప్రకటనకు విలువ ఏముంటుని కొందరి మదిలో ఉన్న అనుమానం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే అనుమానంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications