పల్నాడు కోల్డ్ స్టోరేజిలో ఫైర్, నష్టం రూ.20 కోట్లు
హైదరాబాద్: గుంటూరు జిల్లా రెంటచింతలలోని పల్నాడు కోల్డ్ స్టోరేజిలో బుధవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజిలో నిల్వచేసిన 55వేల మిర్చి టిక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. నష్టం విలువ సుమారు రూ. 20 కోట్ల వరకు ఉంటుందని ప్రాధమిక అంచనా వేశారు.
సమాచారం తెలుసుకున్న పిడుగురాళ్ల, మాచర్ల అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడం..దట్టంగా పొగలు అలుముకోవడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రొక్లెయిన్తో గోడలు పగులకొట్టి మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని అతి పెద్ద కోల్డ్ స్టోరేజీలలో రెంటచింతలోని పల్నాడు కోల్డ్ స్టోరేజి ఒకటి. జిల్లాలోని రైతులు సంవత్సరం పాటు కష్టపడిన పంటను ఇక్కడ కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేస్తుంటారు. బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ఘటనా ప్రదేశానికి విచ్చి... తాము కష్టపడి పండించిన పంట తమ కళ్లెదుటే మంటలలో కాలిపోతుంటే చూడలేక రోదించారు.
ప్రొక్లెనర్లతో గోడలను పగులగొట్టి మిర్చి బస్తాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు... కానీ ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడుతుండడటంతో దట్టమైన పొగలు అలుముకుంటుండడం..మిర్చి ఘాటుకు బస్తాలను తీసుకరాలేకపోయారు.