ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- అధికారం ఆ పార్టీదే: 113 సీట్లు ఖాయం
YSRCP: తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితిని ఓడిస్తూ తీర్పు ఇచ్చారు ఓటర్లు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. హస్తం పార్టీకి పట్టం కట్టారు.
నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రేవంత్తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

ఇక దృష్టి అంతా ఏపీ రాజకీయాలపై మళ్లింది. ఇంకో నాలుగు నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రం ఇది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ సారి క్లీన్ స్వీప్పై నజర్ వేసింది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై చర్చ మొదలైంది. తెలుగుదేశం- జనసేన పొత్తు పెట్టుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2019 నాటి ప్రభంజనాన్ని వైఎస్ఆర్సీపీ మళ్లీ సృష్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
దీనిపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. పోల్ స్కాన్ సర్వే పేరుతో దీన్ని చేపట్టింది. ఈ నెల 1వ తేదీ వరకు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందనే విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే- ఏ పార్టీ అధికారంలో వస్తుందనేది తేల్చేసింది.
ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2,57,000 మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది. వారి అభిప్రాయాలను సేకరించింది. ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గంలో ఉన్న రాజకీయ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుందా సంస్థ.
ఈ సర్వే ప్రకారం చూస్తే- ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ విజృంభణ ఖాయం. మొత్తంగా 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే మరో మాట లేకుండా ఈ 113 స్థానాల్లో ఓటర్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు.
మరో 16 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ నెలకొని ఉంది. తెలుగుదేశం/జనసేన పార్టీ అభ్యర్థులు ఈ 16 చోట్ల వైసీపీతో హోరాహోరీగా తలపడతారు. మరో 46 స్థానాల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చింది. వైసీపీ 50.10 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. ఇది 2019 కంటే అధికం. టీడీపీ-జనసేనకు 43.12, బీజేపీ, కాంగ్రెస్కు 2.08 శాతం ఓట్లు పడతాయి. మరో 4.70 శాతం ఓట్లు నిర్ధారణకు రాలేదు. ఈ రిపోర్ట్- సోషల్ మీడియాలో వైరల్గా మారింది.












Click it and Unblock the Notifications