'ఆ పాప బతకాలి.. నా చేతుల్లోనే వాంతులు చేసుకుంది': అలా చేసుంటే ప్రమాదం జరగకపోయేది?
పోలవరం కాలువ(వట్టిసీమ ఎత్తిపోతల) నుంచి నీరు ఉధృతంగా కృష్ణలో కలిసే చోటు వైపుకు పోనిచ్చాడు.
విజయవాడ: కృష్ణా నదిలో చోటు చేసుకున్న ఘోర పడవ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మృతుల సంఖ్య 19కి చేరడం ప్రమాద తీవ్రతను మరింత పెంచింది.
ప్రభుత్వాల పట్టింపు లేని తనమో.. ప్రైవేటు ఇష్టారాజ్యమో కానీ మొత్తానికి 19నిండు ప్రాణాలు బలైపోయాయి. ప్రమాద కారణాలను అన్వేషించడం, ఎక్స్ గ్రేషియాలు ప్రకటించడం మినహా ఇప్పుడిక చేయగలిగిందేమి లేదు. ముందే ఈ పరిస్థితిని అంచనా వేయడంలో అధికారులు, సంబంధిత శాఖ పూర్తిగా వైఫల్యం చెందినట్టు మాత్రం కనిపిస్తోంది.
Recommended Video


బాలికను రక్షించిన మత్స్యకారుడు
బోటు బోల్తా పడిన సమయంలో కొంతమంది మత్స్యకారులు గుర్తించబట్టి సరిపోయింది కానీ.. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. రక్షణ చర్యల్లో పాలుపంచుకున్న ఓ మత్య్యకారుడు తాజాగా ఘటనపై స్పందించారు.
ప్రమాద సమయంలో తాను ఇద్దరిని రక్షించానని, అందులో ఓ బాలిక కూడా ఉందని చెప్పాడు. పాప చాలా చిన్నది కావడంతో షాక్ కు గురైందని తెలిపాడు. పాపను రక్షించిన సమయంలో తన చేతుల్లోనే వాంతులు చేసుకుందని గుర్తుచేసుకున్నాడు.

పాప బాగుండాలి
పాపను ఒడ్డుకు చేర్చిన తర్వాత మళ్లీ నదిలోకి వెళ్లి ఇంకెవరినైనా కాపాడాలని ప్రయత్నించానని అన్నారు. తిరిగి వచ్చి మళ్లీ పాప గురించి ఆరా తీశానని చెప్పారు. అయితే అప్పటికే పాపను ఆసుపత్రికి తరలించారని, పాప బతికి బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. వాంతులు చేసుకోవడంతో పాప పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు.

అంతా అక్కడివారే
బోటులో ప్రయాణించినవారంతా ఒంగోలు వాకర్స్ క్లబ్ కు చెందినవారేనని తెలుస్తోంది. దాదాపు 60మంది ఆదివారం రెండు బస్సుల్లో గుంటూరు జిల్లాలోని అమరావతి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ దర్శనం అనంతరం కృష్ణా నదిలో స్నానం చేసేందుకు పున్నమి ఘాట్కు చేరుకున్నారు. స్నానం చేసిన తర్వాత పవిత్ర సంగమ ఘాట్ వద్ద హారతి చూడాలని బయలుదేరారు.

అలా చేసి ఉంటే:
ఏపీ పర్యాటక సంస్థ బోట్లు లేవని చెప్పడంతో.. ప్రైవేటు బోటులోనే బయలుదేరారు. అయితే బోటు నడిపే వ్యక్తికి సరైన నైపుణ్యం లేకపోవడం.. ప్రమాదకరమైన ప్రాంతంలో బోటు నడపడానికి అనుమతి ఇవ్వడం కూడా ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.
పోలవరం కాలువ(వట్టిసీమ ఎత్తిపోతల) నుంచి నీరు ఉధృతంగా కృష్ణలో కలిసే చోటు వైపుకు పోనిచ్చాడు. కాలువ నుంచి నీరు నదిలో కలిసే ప్రదేశానికి దగ్గరగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. దానికి దూరంగా బోటును తీసుకెళ్లి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోయేదంటున్నారు. బోటు నడపడం కొత్త కావడంతోనే డ్రైవర్ దాన్ని గుర్తించలేకపోయాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications