బెజవాడలో విషాదం: షాక్ కొట్టి ఒకే ఫ్యామిలీకి చెందిన 5గురు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళనగర్లో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో విద్యుదాఘాతం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
రేకుల షెడ్డు నిర్మిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఊర్మిళా నగర్లో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈ పనుల్లో పాల్గొనేందుకు ఏడుగురు కార్మికులు ఉదయం భవనం వద్దకు చేరుకున్నారు. రేకుల షెడ్ నిర్మిస్తున్నారు. వారిలో ఒకరికి హైటెన్షన్ వైరి తగిలింది. అతడిని రక్షించేందుకు మిగతా ఆరుగురు ప్రయత్నించారు. దీంతో అక్కడికి అక్కడే ఐదుగురు మృతి చెందారు.