విశాఖకు అరుదైన గౌరవం - ఢిల్లీని కాదని తొలిసారి ! రాష్ట్రపతే తరలివచ్చి మరీ.. !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్లో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదిస్తున్న విశాఖ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ప్రధాని మోడీ పర్యటనలో విశాఖకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వెళ్లారు. అందుకు తగ్గట్టుగానే ఓ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహణకు విశాఖ వేదిక కాబోతోంది. అదీ దేశ చరిత్రలోనే తొలిసారి రాజధాని ఢిల్లీలో జరగాల్సిన ఈ ఈవెంట్ ను విశాఖలో నిర్వహించబోతుండటం విశేషం.

విశాఖకు అరుదైన గౌరవం
దేశ భద్రతాపరంగా కీలక స్ధానంలో ఉన్న విశాఖపట్నం నగరానికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ప్రతీ ఏటా దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఓ ప్రతిష్టాత్మక ఈవెంట్ ను నగరంలో నిర్వహించందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా విశాఖకు మరింత ప్రాధాన్యత పెరగడంతో పాటు భవిష్యత్తులో దేశంలోనే కీలక నగరంగా గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. దీంతో ఈవెంట్ కు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.

రేపు విశాఖలో నేవీ డే
తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ నగరంలో ఇప్పుడు దేశంలో నౌకాదళ సేవల్ని గుర్తు చేసుకుంటూప్రతీ ఏటా నిర్వహించే నేవీ డే నిర్వహణకు రంగం సిద్ధమైంది. దేశ భద్రతలో కీలకంగా ఉన్న నౌకాదళ సేవల్ని ప్రతీ ఏటా ఉత్సవంగా నిర్వహించుకుని గుర్తుచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా నౌకాదళ దినోత్సవం (నేవీ డే) అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈసారి నేవీడేను విశాఖలో నిర్వహిస్తుండటంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.

తొలిసారి ఢిల్లీ బయట
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేవీ డేను దేశ రాజధాని ఢిల్లీలోనే నిర్వహిస్తున్నారు. ఈసారి మాత్రం ఢిల్లీకి బదులుగా తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. దీంతో విశాఖ నగరం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిధ్యమిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్రం.. దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇదే కోవలో విశాఖలో నేవీ డే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో చరిత్రలో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమనికి విశాఖ వేదికవుతోంది.

రాష్ట్రపతి ముర్ము రాక
విశాఖలో జరుగుతున్న నేవీడే ఉత్సవాల్లోపాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తరలివస్తున్నారు. ప్రతీ ఏటా ఢిల్లీలో జరిగే నేవీ డే ఉత్సవాల్లో త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఢిల్లీకి బదులు విశాఖలో ఈ ఈవెంట్ జరుగుతుండటంతో రాష్ట్రపతి విశాఖకు వస్తున్నారు. రేపు ఉదయం విజయవాడ నుంచి రాష్ట్రపతి ముర్ము విశాఖ బయలుదేరి వెళతారు. నేవీ డే ఉత్సవాలకు రాష్ట్రపతి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఆమెతో పాటు సీఎం జగన్, నేవీ ఛీఫ్, తూర్పు నౌకా దళాధిపతి, ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.












Click it and Unblock the Notifications