అమరావతిలో మోడ్రెన్ ఫోరెన్సిక్ ల్యాబ్...నేరాల్ని నిగ్గు తేల్చడంతో అతి కీలకపాత్ర...డిఎన్ఎ టెస్టులు సైత
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏర్పాటుకాబోతుంది. దీనిద్వారా నేరపరిశోధన కు సంబంధించి అత్యుత్తమ ఫలితాలు రాబట్టడానికి వీలవుతుంది. ఇటీవలి కాలంలో ఖచ్చితమైన న్యాయ నిర్థారణకు తరుచు అవసరమవుతున్న డిఎన్ఎ టెస్టులను కూడా ఇక్కడే చేస్తారు. ఇంతకీ అమరావతిలో ఏర్పటవుతున్న ఆ ప్రాజెక్ట్ స్టేట్ లెవెల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరీ.
అమరావతికి అతి సమీపంలోని తుళ్లూరు గ్రామంలో స్టేట్ లెవెల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరీని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ల్యాబ్ నిర్మాణం కోసం సీఆర్డీఏ మూడు ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంగణంలోనే జిల్లాకు ఒకటి చొప్పున రీజనల్ సైన్స్ ల్యాబరేటరీలుంటాయి.
పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించింది. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి స్టేట్ లెవల్ లాబ్రేటరీ హైదరాబాద్లో ఉంది. ఎపికి నూతనంగా అమరావతిలో స్టేట్ లెవల్ ల్యాబ్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించటంతో, దీనికి సంబంధించి కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు రావడంతో ల్యాబ్ నిర్మాణానికి రంగం సిద్దమైంది.
ఈ సైన్స్ లాబొరేటరీ ఏర్పాటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేరపరిశోధనకు సంబంధించి ఈ సైన్స్ ల్యాబరేటరీ నివేదికలే అత్యంత కీలకం. వీటి ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించి నేర నిర్థారణ చేయగలుగుతారు. అలాగే డీఎన్ఏ టెస్ట్లు కూడా ఈ ల్యాబ్లో జరుగుతాయి.
రాజధానిలో అంతటి ప్రతిష్ఠాత్మకమైన ల్యాబ్ ఏర్పాటు కాబోతుండటం సంతోషంగా ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీఐడీ పోలీస్ అధికారులు, సీఆర్డీఏ అధికారులు సోమవారం శంకుస్థాపన జరగబోయే ప్రదేశాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లను, భధ్రతాచర్యలను పరిశీలించారు.