లాక్ డౌన్ వేళ పీసీసీ మాజీ అధ్యక్షుడి మృత్యుంజయ హోమం- ఎందుకంటే ?
ఏపీలో కరోనా మహమ్మారి ప్రజలను పీడిస్తున్న వేళ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలను సన్నద్ధం చేసే పనిలో ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు, నేతలు నిమగ్నమయ్యారు. ఎవరికి తోచిన రీతిలో వారు తమ సందేశాన్ని వ్యాప్తి చేసే పనిలో ఉన్నారు. వీరు చేస్తున్న ప్రయత్నాలకు పలు చోట్ల మంచి స్పందన కూడా కనిపిస్తోంది. నిత్యం రాజకీయ వ్యాఖ్యలు, కార్యక్రమాలతో బిజీగా ఉండే వీరంతా ఇప్పుడు కరోనాపై పోరాటంలో చూపుతున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది.
పీసీసీ మాజీ ఛీఫ్ రఘువీరా సైతం..
కరోనాపై జరుగుతున్న యుద్దంలో విజయం సాధించి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ రఘువీరా రెడ్డి మృత్యుంజయ హోమం చేపట్టారు.
ఇంటి ఆవరణంలో అశ్వతకట్టపై మృత్యుంజయ హోమం నిర్వహిస్తుండగా.. ఇందులో రఘువీరాతో పాటు ఆయన కుటుంబం సభ్యులంతా పాల్గొంటున్నారు. పీసీసీ బాధ్యతల నుంచి విముక్తి తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ కాలక్షేపం చేస్తున్న రఘువీరా ఇప్పుడు కరోనాపై పోరులో భాగంగా మృత్యుంజయ హోమం చేపట్టడం ఆసక్తి రేపుతోంది.

ప్రజలకు రఘువీరా సందేశం..
కరోనాపై పోరులో బాగంగా మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్న సందర్భంగా తనను పలకరించిన మీడియా ప్రతినిధులతో రఘువీరా రెడ్డి మాట్లాడారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రభుత్వ అధికారుల ఆదేశాలు సూచనలు తప్పకుండా పాటించి వ్యాధి నివారణకు సహకరించాలని రఘువీరా రెడ్డి కోరారు. అందరూ ఒక్కటిగా ఉండి పోరాడితేనే కరోనాను జయించగలమని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications