Nilam Sawhneyకి బంపర్ ఆఫర్: కేబినెట్ ర్యాంక్: కీలక బాధ్యతలు..కేంద్రంతో సంప్రదింపులు జరిపేలా
అమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ అడ్వైజర్గా నియమితులైన ఆమెకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. ఆమెకు ఇచ్చే వేతనాన్ని నిర్ధారించింది. ముఖ్య సలహాదారుగా ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. పదవీ విరమణ తరువాత కూడా నీలం సాహ్నీ సేవలను వినియోగించువడానికి ప్రధాన కారణం- కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ కాలంతో పాటు, కొన్ని సంక్లిష్ట, సమస్యాత్మక అంశాల్లో ఆమె పనితీరు, వ్యవహార శైలేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కేబినెట్ ర్యాంక్ హోదా..రూ.2.5 లక్షల వేతనం
నీలం సాహ్నీపై వైఎస్ జగన్కు సానుకూల అభిప్రాయమే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె పదవీ కాలాన్ని రెండుసార్లు పొడిగించుకున్నారాయన. గత ఏడాది జూన్ 30వ తేదీ నాడే నీలం సాహ్నీ పదవీ కాలం ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉండటం, వివిధ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో కొత్త వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే.. కొంత గందరగోళం ఏర్పడవచ్చనే అభిప్రాయంతో ఆమె పదవీ కాలాన్ని మూడు నెలలోసారి చొప్పున.. రెండుసార్లు పొడిగించేలా కేంద్రాన్ని ఒప్పించగలిగారు వైఎస్ జగన్.

సలహాదారుగా నియామకానికీ..
1984 బ్యాచ్, ఏపీ క్యాడర్కు చెందిన నీలం సాహ్నీ కిందటి నెల 31వ తేదీన నీలం సాహ్నీ పదవీ విరమణ చేశారు. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలను స్వీకరించారు. తన పదవీ కాలంలో సమర్థవంతంగా విధులను నిర్వర్తించిన అధికారిగా ముఖ్యమంత్రి వద్ద మార్కులు పొందిన నీలం సాహ్నీ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవడంల భాగంగా చీఫ్ అడ్వైజర్గా నియమించారు. ఆమెకు కొన్ని కీలక విభాగాలకు సంబంధించిన బాధ్యతలను అప్పగించారు. తొమ్మిది మంది సిబ్బందిని కేటాయించారు.

కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా..
రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని విషయం తెలిసిందే. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు, సంప్రదింపులను నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వం నీలం సాహ్నీకి అప్పగించింది. వైద్య, ఆరోగ్యం, కోవిడ్-19 మేనేజ్మెంట్, పరిపాలనలో తీసుకుని రావాల్సిన, అమలు చేయాల్సిన సంస్కరణలు, ప్రభుత్వ పనితీరును మరింత సరళీకరించడం, ప్రజలకు చేరువ చేయడం వంటి బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలు, భూ సర్వే వంటి క్షేత్రస్థాయి విధులను నేరుగా పర్యవేక్షించే అధికారాన్ని సాహ్నీకి అప్పగించారు.












Click it and Unblock the Notifications