హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు డీపీఆర్ ఆమోదం: మూడు గంటల్లోనే, కొత్త స్టేషన్లు..!!
హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో కీలక పరిణామం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు ఆమోదం లభించింది. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం మూడు గంటలలోపే చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. గంటకు గరిష్ఠంగా 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను డిజైన్ చేశారు. మొత్తం 761 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో 12 స్టేషన్లు ప్లాన్ చేయగా.. కొత్తగా హైదరాబాద్ లో మూడు స్టేషన్లు నిర్మాణం చేపట్టనున్నారు.
హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టు డీపీఆర్కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో కోకాపేట, శంషాబాద్ విమానాశ్రయం, వికారాబాద్లో స్టేషన్లు నిర్మించాలని అందులో ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ తర్వాత కర్ణాటకలో ఒకటి, మహారాష్ట్రలో తొమ్మిది స్టేషన్లు కలిపి.. మూడు రాష్ట్రాల్లో మొత్తం 13 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
గతంలో హైదరాబాద్ నుంచి పుణె వరకు మాత్రమే హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవలి బడ్జెట్లో హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ - చెన్నె, హైదరాబాద్-పుణె హై స్పీడ్ రైలు ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఈ మూడు హైస్పీడ్ ప్రాజెక్టులకు కలిపి శంషాబాద్లో భారీ స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అనువైన భూమిని సైతం ఇప్పటికే గుర్తించింది.

మూడు గంటల్లోనే ముంబాయికి.. భారీ అంచనాలతో
అయితే, పుణె నుంచి ముంబైకి ఇప్పటికే హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున.. మొత్తంగా దీన్ని హైదరాబాద్-ముంబై హై స్పీడ్ రైలు కారిడార్గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమోదించిన డీపీఆర్లో కోకాపేట స్టేషన్ను అదనంగా చేర్చినట్లు తెలిసింది. హైదరాబాద్-ముంబై హై స్పీడ్ రైలు మొత్తం 761 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ప్రయాణ సమయం 3 గంటలు. ప్రాజెక్టుకు రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2027-28లో నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
తాజా డీపీఆర్ ప్రకారం తెలంగాణలోని కోకాపేట, శంషాబాద్ ఎయిర్పోర్టు, వికారాబాద్, కర్ణాటకలోని కలబుర్గి, మహారాష్ట్రలోని సోలాపూర్, పండరీపూర్, బారామతి, పుణె, పింప్రి చిన్చౌడ్, లోనావాలా, నవీ ముంబై, థానే మీదుగా విక్రోలి వరకు హైస్పీడ్ రైలు ప్రయాణించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు.












Click it and Unblock the Notifications