దీదీకి మరో బిగ్ షాక్: ఎంపీ పదవికి టీఎంసీ ఫైర్బ్రాండ్ రాజీనామా!
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీప ఆమెకున్న పట్టు రోజురోజుకూ బలహీనపడుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన ఈ మంటలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్కు కూడా పాకాయి. పార్టీలో అత్యంత నమ్మకస్థుడైన సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభకు రాజీనామా చేసిన సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే మరో ప్రముఖ మహిళా నేత సుస్మితా దేవ్ కూడా బుధవారం నాడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మమతా క్యాంప్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మమతా బెనర్జీకి ఈ పార్లమెంట్ రాజీనామాలు ఓ వైపు కలవరపెడుతుంటే.. మరోవైపు బెంగాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు. టీఎంసీకి చెందిన దాదాపు 61 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి రెబల్ నాయకుడు రీతబ్రత బెనర్జీకి తమ మద్దతు ప్రకటించడంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు బహిర్గతమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వారం వ్యవధిలోనే ఇద్దరు కీలక రాజ్యసభ ఎంపీలు తమ పదవులను వదులుకోవడం చూస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పతనాన్ని చవిచూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం వారం క్రితం సుఖేందు శేఖర్ రాయ్ మమతా బెనర్జీకి రాసిన సంచలన లేఖే అని చెప్పవచ్చు. ఆ లేఖలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతిని, మహిళలపై జరుగుతున్న ఘోరమైన అణచివేతను, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర అరాచకత్వాన్ని పూర్తిగా తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి, శాంతిభద్రతలతో సహా అన్ని రంగాలలో మమతా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే మొదటిసారిగా ఓటర్లు బీజేపీకి సీట్ల పరంగా భారీ విజయాన్ని అందించారని సుఖేందు శేఖర్ రాయ్ బీజేపీని ప్రశంసించారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇప్పటికే తన ఎన్నికల హాగ్దానాలకు అనుగుణంగా బెంగాల్ సమగ్ర అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం బహుళ కార్యక్రమాలను అమలు చేయడం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్లే ఆయన పార్టీని వీడగా.. ఇప్పుడు అదే బాటలో సుస్మితా దేవ్ కూడా నడవడం గమనార్హం.
రాజీనామా చేసిన సుస్మితా దేవ్ రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆమె గతంలో అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎంపీగా పనిచేశారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె కాంగ్రెస్ను వీడి, 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా మారిన సుస్మితా.. టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఆమెకు రాజ్యసభ సీటును కూడా కేటాయించింది. అంతలా ప్రాధాన్యత దక్కినప్పటికీ, బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు మరియు పార్టీపై వస్తున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆమె ఇప్పుడు హఠాత్తుగా పదవిని వీడినట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications