నేడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవీ విరమణ.. వాట్ నెక్స్ట్? ఐవైఆర్ బాటలోనా.. లేక..!
అమరావతి: ఎల్వీ సుబ్రహ్మణ్యం. పూర్తి పేరు లంకా వెంకట సుబ్రహ్మణ్యం. సీనియర్ ఐఎఎస్ అధికారి. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు మూడో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఎంత వివాదాస్పద పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలను అందుకున్నారో.. అంతే వివాదాస్పద పరిస్థితుల మధ్య ఆ బాధ్యతలను తప్పుకొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థానం నుంచి బదిలీ అయిన ఆయన మరి కాస్సేపట్లో పదవీ విరమణ చేయనున్నారు.
మే 3 తరువాత శ్రీవారి దర్శనంపై టీటీడీ ఈఓ క్లారిటీ: పద్మావతి పరిణయోత్సవాలు సైతం..!
హెచ్ఆర్డీ డీజీగా..
1983 బ్యాచ్, ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం. ప్రస్తుతం ఆయన మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా పని చేస్తున్నారు. ఆయన పదవీ కాలం గురువారం నాటితో ముగిసింది. మధ్యాహ్నంలోపే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీతో పాటు మరో ఐఎఎస్ అధికారిణి పద్మ కూడా నేడే పదవీ విరమణ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్గా పని చేస్తున్నారు.
మూడో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా..
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రానికి మూడో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు పొందారు. ఆయన కంటే ముందు ఐవైఆర్ కృష్ణారావు, అనిల్ చంద్ర పునేఠా ఆ బాధ్యతలను నిర్వర్తించారు. అదే విచిత్రమో గానీ.. అనిల్ చంద్ర పునేఠా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ కాలం ముగిసేంత వరకూ కొనసాగలేదు. అర్ధాంతరంగా తప్పుకొన్నారు. ఆయన లాగే.. ఎల్వీ కూడా మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. బదిలీ వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారిగా..
గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఎల్వీ సుబ్రహ్మణ్యం సారథ్యంలోనే కొనసాగాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్గా గోపాలకృష్ణ ద్వివేదీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం.. వారిద్దరూ సార్వత్రిక ఎన్నికలను సజావుగా నడిపించారనే గుర్తింపును తెచ్చుకున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏరికోరి నియమించారు. తన సమర్థతను ఎల్వీ నిరూపించుకున్నారు.
వివాదాస్పద పరిస్థితుల్లో
అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఒత్తిడి మేరకు అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు, ఇద్దరు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు పిటీషన్ను దాఖలు చేశారు అనిల్ చంద్ర పునేఠా.
ఎల్వీనే కొనసాగించిన జగన్..
తమ ఆదేశాలను ధిక్కరిస్తూ హైకోర్టుకు వెళ్లారనే ఆగ్రహంతో పునేఠాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆ బాధ్యతలను ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అప్పగించింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎల్వీ సమర్థతను గుర్తించిన వైఎస్ జగన్ ఆయననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. పలు సందర్భాల్లో వైఎస్ జగన్కు మార్గదర్శనం చేశారని అంటుంటారు. తదనంతరం- కొన్ని వివాదాస్పద పరిస్థితులు ఎల్వీని చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి కార్యాలయం పేషీలో చోటు చేసుకున్న పరిణామాల మధ్య ఆయనను తప్పించాల్సి వచ్చింది.
Recommended Video
వాట్ నెక్స్ట్..?
వైఎస్ జగన్ నమ్మకాన్ని కోల్పోవడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి అర్ధాంతరంగా బదిలీ అయ్యారని చెబుతుంటారు. ఎల్వీని తొలగించిన ప్రభుత్వం.. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ప్రస్తుతం ఆయన అక్కడే కొనసాగుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవీ విరమణ తరువాత ఆయన అడుగులు ఎటుపడతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులు పదవీ విరమణ తరువాత ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. డాక్టర్ పీవీ రమేష్,అజేయ కల్లం వంటి అధికారులు సలహాదారులుగా ఉన్నారు. మరో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాజకీయల్లో అడుగు పెట్టారు. బీజేపీలో చేరారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎటు వైపు వెళ్తారనేది చర్చనీయాంశమౌతోంది.