మాజీ సీఎంతో బాలయ్య షో రెడీ - టార్గెట్ ఎవరు..!!
అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన కేరీర్లోనే మొదటిసారిగా హోస్ట్గా వ్యవహరిస్తోన్న టాక్ షో- అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. గత ఏడాది బుల్లితెరపై సందడి చేసిన ఈ షోనకు కొద్దిరోజుల పాటు బ్రేక్ పడింది. మళ్లీ ఫ్రెష్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ సందడి చేశారు.

గెస్ట్గా నల్లారి..
ఇప్పుడు తాజాగా మరో మాజీ ముఖ్యమంత్రి ఈ టాక్ షోనకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే గెస్ట్గా రాబోతోన్నారు. ఆయనతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి కూడా ఇదే ఎపిసోడ్లో కనిపించబోతోన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సురేష్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ సోమవారం ప్రారంభం కానుంది.

రాజకీయ నేతల హవా..
గత ఏడాది ఆరంభమైన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తొలి ఎపిసోడ్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్గా హాజరైన విషయం తెలిసిందే. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మోహన్ బాబు ఆ తరువాత పార్టీ మారారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా సినిమా-రాజకీయ నాయకులు అతిథులుగా ఈ టాక్ షో కొనసాగింది. అనంతరం అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్కు గెస్ట్గా చంద్రబాబు, నారా లోకేష్ హాజరయ్యారు.

పొలిటికల్ ప్లాట్ఫామ్..
ఇప్పుడిక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కే ఆర్ సురేష్ రెడ్డి అతిథులుగా రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రమంగా ఈ టాక్ షో ఓ పొలిటికల్ ప్లాట్ఫామ్గా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, ఇతర సెలెబ్రిటీలే కాకుండా తరచూ రాజకీయ నాయకులను కూడా ఈ టాక్ షోనకు అతిథులుగా పిలిచే ఆనవాయితీ కొనసాగుతుందని చెబుతున్నారు.

క్రియాశీలక రాజకీయాలకు దూరంగా..
ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు గానీ అది విజయవంతం కాలేదు. 2014 ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ తరువాత మళ్లీ ఆయన రాజకీయాల్లో కనిపించలేదు. తెరమరుగు అయ్యారు. ఇదివరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరిస్తారనే ప్రచారం జరిగింది గానీ- అది వాస్తవ రూపం దాల్చలేదు.












Click it and Unblock the Notifications