భూమాకు పదవిపై వైఎస్సార్ ఏం చెప్పారు: బయట పెట్టిన మాజీ సీఎం..!!
వైఎస్సార్ మరణం ముందు ఏం జరిగింది. భూమా కుటుంబం గురించి వైఎస్సార్ ఏం చెప్పారు. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి అనేక అంశాలను చెప్పుకొచ్చారు. తాను వైఎస్సార్ తో కలిసి హెలికాప్టర్ వెళ్లాల్సిన వాడినని..వెళ్లకపోవటంతో ప్రాణాలతో ఉండి ముఖ్యమంత్రిని అయ్యాయనని..అదే విధంగా రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు.
వైఎస్సార్ మరణానికి ముందు...
2009, సెప్టెంబర్ 1. మధ్నాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదాపడ్డాయి. ఆ తరువాత స్పీకర్ గా తాను తన కార్యాలయంలో ఉండగా సీఎం వైఎస్సార్ నుంచి ఫోన్ వచ్చిందని గుర్తు చేసారు. ఆ చర్చలో భాగంగా అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ గా ఎవరికి అవకాశం ఇస్తున్నారంటూ వైఎస్సార్ ప్రశ్నించారని వివరించారు.
సహజంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తిగా పీఏసీ ఛైర్మన్ గా అవకాశం ఇస్తామని..ఆ విధంగానే నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించిన విధంగా నాగం జనార్ధన్ రెడ్డికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తాను చెప్పానని, మూడు కమిటీల నియామకానికి సంబంధించి మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ తాను వైఎస్సార్ కు వివరించినట్లుగా కిరణ్ చెప్పుకొచ్చారు.
భూమా శోభా నాగిరెడ్డికి ఆ పదవి ఇవ్వాలంటూ..
తాను నాగం జనార్ధన రెడ్డి పేరు పక్కన పెట్టి శోభానాగిరెడ్డికి ఇవ్వాలని తనకు సూచించారని కిరణ్ వెల్లడించారు. అయితే, ఆ సమయంలో తాను జోక్యం చేసుకొని మీ పక్కన ఆయన ఉన్నారా అని అడిగానని..దానికి వైఎస్సార్ అవునని చెబుతూనే..ఎందకని అడగ్గా..తాను వచ్చి కలుస్తానని చెప్పి ఆ చర్చ ముగించానని కిరణ్ చెప్పుకొచ్చారు.
ఇక, ఆ తరువాతి రోజున తాను వైఎస్సార్ తో కలిసి వెళ్లాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో ఆగిపోయానని కిరణ్ గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 2న తాను స్పీకర్ కార్యాలయంలో ఉండగా..తనకు వైఎస్సార్ హెలికాఫ్టర్ మిస్సింగ్ సమాచారం వచ్చిందన్నారు. వైఎస్సార్ గ్రేట్ లీడర్ అంటూ అటు కిరణ్..ఇటు నందమూరి బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు.
నాడే భూమా కుటుంబానికి ప్రాధాన్యత..
2009 ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం నుంచి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే వైఎస్సార్ తో భూమా కుటుంబానికి సఖ్యత ఉంది. దీంతో, టీడీపీని కాదని శోభా నాగిరెడ్డికి పీఏసీ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ భావించారు. ఆయన మరణం తో ఆ నిర్ణయం ఆగిపోయింది. కానీ, వైఎస్సార్ మరణం తరువాత జగన్ పార్టీ ఏర్పాటు సమయంలో.. కాంగ్రెస్- టీడీపీలోని మద్దతు ఎమ్మెల్యేతో పాటుగా శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చారు.
జగన్ పార్టీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల పోలింగ్ ముందు రోడ్డు ప్రమాదంలో మరణించారు. కానీ, ఆ ఎన్నికల్లోనూ శోభా నాగిరెడ్డే విజయం సాధించారు. ఇక, ఆ తరువాత భూమా నాగిరెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచిన అఖిల ప్రియ వైసీపీని వీడి టీడీపీకి దగ్గరయ్యారు. నాగిరెడ్డి మరణం తరువాత 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.