చంద్రబాబుతో మాజీ డీజీపీ సాంబశివరావు భేటి...ఏ రాజకీయపార్టీలోకి రాను!
అమరావతి:ఎపి మాజీ డిజిపి సాంబశివరావు రాజకీయ పార్టీల అధినేతలతో భేటీలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ప్రతిపక్షనేత జగన్ ను కలవడం ద్వారా చర్చనీయాంశంగా మారిన ఈ ఎపి మాజీ డిజిపి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంగళవారం ఆయన ఉండవల్లిలోని సిఎం నివాసంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి మాట్లాడారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...'నాకు ఏ రాజకీయ పార్టీలోకి వచ్చే ఆలోచన లేదు...చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ సీపీగా ఉండి మర్యాదపూర్వకంగా కలిశా...ఇటీవల గంగవరం పోర్టు వద్దకు వచ్చినప్పుడు జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశా..' అని చెప్పుకొచ్చారు. నామినేటెడ్ పదవిని చేపట్టే విషయమై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేయలేదని మాజీ డీజీపీ సాంబశివరావు ఈ సందర్భంగా తెలిపారు.

వైసిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించడంపై సాంబశివరావును ప్రశ్నించగా...సమన్వయ లోపం కారణంగానే తాను వైసీపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించి ఉండవచ్చని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఇప్పట్లో లేదని తేల్చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, సీఎం చంద్రబాబుతో భేటీలో కూడా ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని చెప్పారు.
గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి సలహాలు ఇచ్చానని వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని...తనకంత శక్తి కూడా లేదని మాజీ డిజిపి సాంబశివరావు అన్నారు. అయితే సాంబశివరావు వెల్లడించిన విషయాలే తప్ప సిఎం, మాజీ డిజిపి మధ్య జరిగిన చర్చల తాలూకూ వివరాలేమీ బయటకు తెలియరాలేదు.
మాజీ డీజీపీ సాంబశివరావు మూడు రోజుల క్రితం విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవడం...ఆయనతో సుమారు 20 నిమిషాల పాటు చర్చించడంపై విభిన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మాజీ డిజిపి మొన్న జగన్ను కలవడం, ఇప్పుడు చంద్రబాబును కలవడంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications