అచ్చెన్నకు సర్జరీ..ఇంట్లోనే వైద్యం: ఆయన భార్య ఏం చెబుతున్నారు? చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనారోగ్యానికి గురయ్యారా? రెండురోజుల కిందటే ఆయనకు సర్జరీ నిర్వహించారా?, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రెండు రోజుల కిందటే తన భర్తకు సర్జరీ జరిగిందని, విశ్రాంతి తీసుకుంటోన్న సమయంలోనూ ఏసీబీ అధికారులు, పోలీసులు ఆయనను అరెస్టు చేశారని అచ్చెన్నాయుడి భార్య విజయ మాధురి తెలిపారు.

గురువారం రాత్రి నుంచే..
గురువారం రాత్రి నుంచే గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటిని చుట్టుముట్టారని ఆమె ఆరోపించారు. ఏసీబీ అధికారులమంటూ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టు అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాత్రంతా ఆయన నిద్రపోలేదని, మందులు వేసుకోవడానికి కూడా గడువు ఇవ్వలేదని అన్నారు. ఇల్లంతా సోదా చేశారని అన్నారు. తెల్లవారు జామున తన భర్తను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారని అన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేని చెప్పారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అచ్చెన్నాయుడు అరెస్టు అనంతరం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అచ్చెన్నాయుడి భార్యాబిడ్డలకు చెప్పకుండా కిడ్నాప్ చేశారని ఆరోపించారు. 300 మంది అచ్చెన్న ఇంటిపై దాడి చేశారనే సమాచారం తన వద్ద ఉందని అన్నారు. రెండు రోజుల కిందటే అచ్చెన్న సర్జరీ చేయించుకున్నారని, ఇంట్లోనే వైద్యం చేయిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అలాంటి స్థితిలో కూడా అర్దరాత్రి నీచంగా కిడ్నాప్ చేశారని మండిపడ్డారు. మందులు వేసుకోడానికి కూడా అనుమతించలేదని అన్నారు.

అరెస్టు చేసి కట్టుకథలు
అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన తరువాత జగన్ ప్రభుత్వం కట్టుకథలు చెబుతోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అవినీతిని ఎండగట్టినందుకే అచ్చెన్నపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. అసెంబ్లీలో తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లే ఇలాంటి దుర్మార్గాలకు తెగించారని విమర్శించారు.

మచ్చలేని కుటుంబం
అచ్చెన్నాయుడిది మచ్చలేని కుటుంబం అని చంద్రబాబు అన్నారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్న ఉన్నత ప్రమాణాలు, రాజకీయ విలువలను పాటించే కుటుంబమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అచ్చెన్న కుటుంబానికి ఆదరణ ఉందని చెప్పారు. ఎర్రన్నాయుడి కుటుంబ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే అసత్య ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొలేక దొడ్డిదారిన దొంగదెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.

నల్లజెండాలతో నిరసన
బీసీలపై కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్న అరెస్ట్ అయ్యారని చంద్రబాబు అన్నారు. బీసీల నాయకత్వాన్ని అణగదొక్కతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలపై దాడులు అడ్డుకున్నందుకే అచ్చెన్నపై కక్ష కట్టారని అన్నారు. దీనికి తగిన మూల్యాన్ని వైఎస్ జగన్ చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. బీసీ సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications