నేను పేకాట ఆడుతా - భూమన ప్రత్యేకత అదే: బాలినేని..!!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను గతంలో పేకాట ఆడేవాడనంటూ పార్టీ సమావేశంలో చెప్పుకొచ్చారు. అదే సమయంలో సహచర పార్టీ నేతలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కొనసాగించారు. గతంలో క్యాసినో నిర్వహణపైన చీకోటి ప్రవీణ్ ను ఈడీ అధికారుల విచారణ సమయంలోనూ బాలినేని కొన్ని ఆసక్తి కర అంశాలను బయట పెట్టారు. తాను చెన్నైలో పేకాట ఆడేవాడినని క్యాసినో తెలియదని స్పష్టం చేసారు. వరుసగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న బాలినేని ఇప్పుడు పార్టీ నేతల సమక్షంలోనే పేకాట అలవాటు గురించి వివరించారు.
ఒంగోలులో వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాలినేని కీలక ప్రసంగం చేసారు. గతంలో తనకు జూదం అలవాటు ఉందని..చెన్నైలో ఆడేవాడినని చెప్పుకొచ్చారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు బీదా మస్తాన్రావు, భూమన కరుణాకర్రెడ్డి ఈ సమావేశానికి వచ్చా రు. వారిని బాలినేని కార్యకర్తలకు పరిచయం వారి ప్రత్యేకతలను వివరించారు. బీద మస్తాన్ రావు తనకు టీడీపీలో ఉన్న సమయం నుంచే పరిచయం ఉందన్నారు. తరచూ చెన్నైలో కలుసుకొనే వారిమని..తనకు పేకాట ఆడే అలవాటు ఉంది కానీ, మస్తానరావుకు లేదని చెప్పుకొచ్చారు. తాను చేసే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో మస్తానరావు వ్యాఖ్యానించే వారని బాలినేని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో భూమన గురించి చెప్పుకొచ్చారు. భూమన కరుణాకర్రెడ్డికి వాక్ చాతుర్యం ఉందని..అదే ఆయన ప్రత్యేకతగా బాలినేని చెప్పుకొచ్చారు.
ఈ మధ్య కాలంలో బాలినేని తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కుతుందో లేదో అంటూ కొత్త చర్చకు కారణమయ్యారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ తన టికెట్ విషయంలో ఏం చేస్తారో చూడాలంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి సీటు కోసం బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాలినేని వంటి మంచి నేతలు వైసీపీలో ఉన్నారంటూ పవన్ కల్యాణ్ ప్రశంసించారు. బాలయ్య సినిమా వీరిసంహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ దర్శకుడు మలినేని ప్రత్యేకంగా బాలినేనికి ధన్యవాదాలు చెప్పారు. మాజీ మంత్రిగా మారిన తరువాత బాలినేని వ్యవహార శైలిలో కొత్తగా మార్పులు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.