ముద్రగడ జనసేనలో చేరనున్న వేళ.. తెరపై హరిరామ జోగయ్య: మొహమాటం వద్దు
Pawan Kalyan: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నాయకుల పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని అసంతృప్త నేతలు పక్క చూపులు చూస్తోన్నారు. ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోతున్నారు. కండువాలను మార్చేస్తోన్నారు.
మొన్నటివరకు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించిన కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం జనసేనలో చేరడానికి సంసిద్ధులయ్యారు. ఇప్పటికే జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆయనను కలిశారు కూడా.

ముద్రగడ పద్మనాభం.. జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సాయంత్రం ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్తో పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించీ మాట్లాడారు. కాపు సామాజిక ఓటుబ్యాంకు చీలిపోకుండా కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాలపై పవన్ కల్యాణ్కు హరిరామ జోగయ్య దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. వీలైనంత వరకు ఎక్కువ సీట్లను సాధించాల్సి ఉంటుందని సూచించారు. సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి మొహమాటాలకు వెళ్లొద్దని, ముఖ్యమంత్రి పదవిపైనా వెనుకంజ వేయొద్దని కోరినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం దక్కేలా చేయాలని పవన్ కల్యాణ్ను కోరినట్లు సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ అభిలాషిస్తోన్నారని, దాన్ని నిజం చేయాలంటే సీట్ల పంపకాలు, ముఖ్యమంత్రి పదవి విషయంలో భేషజాలకు వెళ్లొద్దని సూచించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications