వైఎస్ జగన్ టీమ్లో కడప జిల్లా సీనియర్ నేత?
కడప: సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయ అనుభవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారా? రాష్ట్ర రాజకీయాలు, రాయలసీమ జిల్లాలపై గట్టి పట్టు ఉన్న ఆయనకు పార్టీలో లేదా ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ పదవిని కట్టబెట్టాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డీఎల్ రవీంద్రా రెడ్డి సేవలను ఏదో ఒక రకంగా వినియోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు డీఎల్ రవీంద్రా రెడ్డి. చాలాకాలం పాటు ఆయన కాంగ్రెస్లో కొనసాగారు. జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికయ్యారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. విభజనకు కారణమైన కాంగ్రెస్లో కొనసాగలేని స్థితిని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీల్లో చేరడానికి చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు- మైదుకూరు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించి, విఫలం అయ్యారు. స్వయంగా చంద్రబాబును కలుసుకున్నప్పటికీ.. టికెట్ దక్కలేదు.
ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పోలింగ్కు కొద్దిరోజుల ముందు వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా డీఎల్.. వైఎస్ జగన్ కుటుంబానికి దగ్గర అయ్యారు. వివేకానంద రెడ్డి హత్యోదంతం తెలిసిన వెంటనే ఆయన పులివెందులకు వెళ్లారు. వైఎస్ జగన్ను కలిశారు. అంత్యక్రియలు ముగిసేంత వరకూ ఆయన కుటుంబం వెంటే ఉన్నారు.
దీనితో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరిక లాంఛనప్రాయమే అయింది. పార్టీలో చేరిన అనంతరం- మైదుకూరు అభ్యర్థి శెట్టిపల్లి రఘురామి రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. తనకు గట్టి పట్టు ఉన్న చాపాడు, బ్రహ్మంగారి మఠం, దువ్వూరు వంటి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తన అనుచరులు, క్యాడర్ను వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గు చూపేలా చేశారు.
అప్పటి నుంచీ ఆయన వైఎస్ జగన్ కంట్లో పడ్డారు. ఊహించినట్టే వైఎస్ఆర్ సీపీ ఘన విజయాన్ని సాధించడం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో- జిల్లాలో పార్టీపై మరింత పట్టు బిగించడంతో పాటు ఎదురు దాడి చేయగల సామర్థ్యం ఉన్న డీఎల్ రవీంద్రా రెడ్డి సేవలను వినియోగించుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా- మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు కూడా డీఎల్ను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని సిఫారసు చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎల్ రవీంద్రా రెడ్డి త్వరలో పార్టీ లేదా, ప్రభుత్వంలో కీలక స్థానంలో నియమితులు కావచ్చని సమాచారం.