చంద్రబాబు- జగన్ మధ్య ఉన్న తేడా ఏమిటో తేల్చేసిన మాజీ మంత్రి..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక అభివృద్ది నెలకొందని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విద్యపై 30,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు.
విజయవాడ: సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను వైసీపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విద్యపై ఏకంగా 30,000 కోట్ల రూపాయలను వ్యయం చేసిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని చెప్పారు. విద్యపై పెట్టుబడి పెట్టడం అనేది విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు- విద్య ప్రభుత్వ బాధ్యత కాదని తప్పించుకోగా..- దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద గడపలకు చేర్చారని అన్నారు.

మానవ వనరుల అభివృద్ధి..
విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొలుసు పార్థసారథి మాట్లాడారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెచ్చిందని, మానవ వనరుల అభివృద్ది జరగడం వల్ల దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. చంద్రబాబు, జగన్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతో తేడా ఉందని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు.

99 శాతం..
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 99.5 శాతం వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, దీన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంటే అల్లర్లు, వర్గ విభేదాలు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు పబ్బం గడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తోందని వివరించారు.

విద్యకోసం 30,000 కోట్లు..
గత ప్రభుత్వాలు చేయని విధంగా విద్యా రంగానికి 30,000 కోట్ల రూపాయలను జగన్ కేటాయించారని గుర్తుచేశారు. కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ ను పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని, విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారని కొలుసు గుర్తు చేశారు.

పార్టీలకు అతీతంగా..
దానికి భిన్నంగా వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన ద్వారా 213 మంది విద్యార్థులకు 19.95 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుది విభజించి పాలించు విధానమని పార్థసారథి విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతిని ప్రోత్సాహించారని, తమ ప్రభుత్వం మాత్రం టీడీపీ నాయకుడి కూతురికి విదేశీ విద్యాదీవెన కింద 84 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించిందని అన్నారు.

సమూల మార్పులు..
జగనన్న విద్యా కానుక కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ మూడు జతల యూనిఫారాలు, నోట్బుక్లు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్లను అందజేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని, జగన్ ఆ తప్పులను సరి చేస్తోన్నారని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications