మాజీ మంత్రి నారాయణ అరెస్టు.. విజయవాడకు తరలింపు..ఏం జరుగుతోంది.?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదోతరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ కొండాపూర్లోని ఇంట్లో ఉన్న నారాయణను అధికారులు విచారిస్తున్నారు.అయితే నారాయణ ఆరోగ్యం సరిగ్గా లేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇటీవలే ఏపీలో పదోతరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు వరుసగా లీకయ్యాయి. ఈ లీకేజీ వెనక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని తిరుపతిలో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి విజయవాడ నుంచి కేసును విచారణ చేస్తున్న చిత్తూరు జిల్లా పోలీసుల బృందం హైదరాబాద్ వచ్చింది. లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన మాజీ మంత్రి నారాయణను పోలీసులు విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే పోలీసుల అదుపులో ఉన్న నారాయణను విజయవాడకు ఆయన సొంత బెంజ్ కారులోనే తరలిస్తున్నట్లు సమాచారం.