చంద్రబాబు కంటే నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివాడుగా..!!
చిత్తూరు జిల్లా కుప్పంలో యువ గళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రసంగం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో యువ గళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రసంగం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీసిటీ ఏర్పాటైతే- దాన్ని నారా లోకేష్ టీడీపీ ఖాతాలో వేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోన్నారు. రాజకీయంగా ఆయన ఎంత అజ్ఞాని అనేది ఇక్కడే స్పష్టమైందని వ్యాఖ్యానిస్తోన్నారు.

పది ఆకులు ఎక్కువే..
అబద్ధాలు చెప్పడం, అసత్యాలు వల్లించడంలో చంద్రబాబు ఒక ఆకు చదివితే..నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే నారా లోకేష్ ఇలా ఎందుకు రోడ్డున పడతారని చురకలు అంటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నారా లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడారని, ప్రజలు ఏమనుకుంటారో అనే ధ్యాస కూడా లేదని చెప్పారు.

ఈ గతి పట్టేదా?
చంద్రబాబు నాలుగు మంచి పనులు చేసి ఉంటే- ఇవాళ నారా లోకేష్ కు ఇలా రోడ్ల వెంట పడి తిరిగే గతి పట్టేది కాదని పేర్నినాని అన్నారు. మంచి పనులే చేసి ఉంటే ప్రజలు ఎందుకు టీడీపీని ఇంత చిత్తుచిత్తుగా ఓడించారని ప్రశ్నించారు. ప్రజలను మాయాజాలం, అసత్యాలు, భ్రమల్లో ముంచారని, దాన్ని గమనించే ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలు, అసత్యాలు నారా లోకేష్ నోటి వెంట వస్తోన్నాయని చెప్పారు.

పోలీసులను కించపర్చేలా..
తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యల పట్ల పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం టీడీపీ నాయకులు అమిత్ షా వద్దకు, కోర్టులకు వెళ్లి గన్మేన్లను పెంచుకుంటారని, రక్షణగా పోలీసులు కావాలని డిమాండ్ చేస్తారని, ఇప్పుడు 500 మంది పోలీసులు ఎందుకు వచ్చారని నిలదీస్తోన్నారని తప్పుపట్టారు. పోలీసులు, గన్మెన్ల భద్రతతో బతికే టీడీపీ నాయకులు పోలీసుల గురించి ఇంత అసభ్య పదజాలంతో ఎలా మట్లాడగలుగుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.

పిట్టలదొర..
నారా లోకేష్ స్పీచ్ విన్న తరువాత ఆయనకు, పిట్టల దొరకు తేడా ఏదీ కనిపించలేదని పేర్ని నాని అన్నారు. ఆయనవన్నీ పిట్టల దొర మాటలేనని, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక పిట్టల దొరను కన్నాడని ధ్వజమెత్తారు. పిట్టల దొరలు సంక్రాంతి ముందు వస్తే- లోకేష్ సంక్రాంతి తరువాత జనం ముందుకొచ్చాడని విమర్శించారు. తండ్రి కొడుకు పోటుగాళ్లు అయితే పొత్తులు ఎందుకని, నేరుగా వైఎస్ జగన్ పై ఒంటరిగా పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు.

ఏ అర్హత ఉందని..
నారా లోకేష్ ఏ అర్హతతో మంత్రి పదవి వెలగబెట్టాడని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేస్తే మంత్రివి అయ్యావా? ఎమ్మెల్సీ అవ్వడానికి ఉన్న అర్హత ఏంటి? ఒక్క చంద్రబాబు కడుపున పుట్టడమే నీ అర్హత అని ఘాటుగా విమర్శించారు. 2014 నుంచి 2019 దాకా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు మళ్లీ ఏర్పాటు చేస్తామని, తమకు అవకాశం ఇవ్వండని అడిగే దమ్ముందా లోకేష్.. అంటూ పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు.

మిల్లీమీటర్ కూడా..
ఈ అబద్ధాల లోకేష్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా పేదల హృదయాల్లో వైఎస్ జగన్ సంపాదించుకున్న సుస్థిర స్థానాన్ని మిల్లీమీటరు కూడా కదిలించలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. లోకేష్..ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లో వడ్డీ వ్యాపారం చేస్తోన్నారని, టీడీపీ పాలనలో తండ్రి కొడుకులు అరాచకాలు చేశారని ధ్వజమెత్తారు. ఎన్ని గుడులు నేలమట్టం చేశారో అందరికీ తెలుసిన విషయమేనని వ్యాఖ్యానించారు. పార్టీ ఉనికి కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తోన్నాడని అన్నారు.












Click it and Unblock the Notifications