ద్రోణి తీవ్రం- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మందగించినప్పటికీ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒకింత వర్షాలకు లోటు ఉండట్లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తరచూ వర్షాలు పడుతున్నాయి.
నేడు కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో వాతావరణంలో వేగంగా మార్పులు సంభవించనున్నాయి. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుంది.

అలాగే.. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. వీటితో పాటు దక్షిణ కోస్తా పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షపు జల్లులు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రాయలసీమ పరిధిలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు కురిసే వీలుంది.
పిడుగుల పడే ప్రమాదం ఉన్నందున విపత్తు నిర్వహణ సంస్థ ప్రజల రక్షణ కోసం కొన్ని ముఖ్యమైన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చేలల్లో పనులకు వెళ్లే రైతులు, పొలాల్లో ఉండే పశువుల కాపరులు ఉరుముల శబ్దం వినబడగానే చెట్ల కిందకు చేరకుండా, సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోకి వెళ్లి ఆశ్రయం పొందాలని సూచించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, లోహపు వస్తువులు, బలహీనమైన పాత గోడల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవద్దని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications