సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై వైసీపీ వైఖరి స్పష్టం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్, పీ క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమైంది. సాయికృష్ణ తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసిన అనంతరం పరిస్థితులు సద్దుమణిగినట్టే భావిస్తోన్నప్పటికీ.. వైఎస్ఆర్సీపీ మరింత ముందుకే వెళ్తోంది. మున్ముందు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరక్కడదనే ఉద్దేశంలో ఉంది. దీనిపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తును కోరకుంటోంది.
ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజారాణి జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను కలిశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సాయికృష్ణ మృతి ఘటనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అధికారం దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయని, కస్టడీలో హింస, శారీరక వేధింపులు, ఆచూకీపై సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటిపైనా స్వతంత్ర, నిష్పాక్షిక, కాలపరిమితి గల విచారణ జరిపించాలని కోరారు. మున్ముందు ఇటువంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనను కూడా ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మరణానికి ముందు క్రాంతికుమార్ స్వయంగా రికార్డు చేసినట్లు చెబుతున్న వీడియోలో కృష్ణలంక సీఐ నాగరాజుపై నిరంతర వేధింపులు, మానసిక చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వైరల్ వీడియోతో పాటు మొబైల్ ఫోన్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని కమిషన్ను కోరారు.
సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలు రాష్ట్రంలో పోలీసు జవాబుదారీతనం, అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కుల పరిరక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, దోషులపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకునేలా ఎన్హెచ్ఆర్సీ అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని, రాజ్యాంగ విలువలు, మానవ గౌరవం, న్యాయ పాలన పరిరక్షణ కోసం స్వతంత్ర విచారణ నిర్వహించాలని ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజారాణి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications