ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీకి సంబంధించి ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు రంగప్రవేశం చేయడంతో ఈ- బస్సులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఆర్టీసీలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుంది అన్న వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులకు మంత్రి సమాధానం చెప్పారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ వదంతులు.. ఉద్యోగుల ఆందోళన
సంస్థలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సిబ్బందిని భర్తీ చేయకపోవడం, ఆర్టీసీకి కావలసిన విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, నిర్వహించే స్థితిలో ఆర్టీసీ లేదని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలు ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది అన్న చర్చ కొనసాగింది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
apsrtc ప్రైవేటీకరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇక తాజాగా దీనిపైన ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు apsrtc ని ప్రైవేటీకరణ చేయబోమని, అపోహలకు ఎటువంటి తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖపట్నంలోని సింహపురి ఈ- బస్సు డిపో పవర్ రూమ్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు నెలల్లో రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ-బస్సులు
రవాణా రంగంలో పీఎం ఈ-బస్ సేవతో నూతన శకం మొదలైందని, మరో రెండు నెలల్లో రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ బస్సులు రానున్నాయని, అందులో విశాఖకు వంద బస్సులు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ- బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ పై వచ్చిన పుకార్లను, అపోహలను కొట్టిపారేస్తూ మంత్రి స్పష్టత నిచ్చారు.

ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం అన్న మంత్రి
కూటమి ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ప్రైవేటీకరణకు ఎటువంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. పర్యావరణ హితమైన ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆందోళన అవసరం లేదన్నారు.
ఉద్యోగుల ఆందోళనలు, అపోహలకు చెక్ పెట్టిన మంత్రి
అయితే ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రైవేటీకరణ జరుగుతుందన్న ఆందోళనలో ఉన్న క్రమంలో తాజాగా మంత్రి ప్రకటనతో వారిలోని ఆందోళనకు, అపోహలకు చెక్ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు గానే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కొనసాగుతారని, తమ ప్రభుత్వం ఎటువంటి ప్రైవేటీకరణ చర్యల దిశగా అడుగులు వేయడం లేదని మంత్రి స్పష్టంగా చెప్పారు.












Click it and Unblock the Notifications