మాకూ రెండు చెప్పులున్నాయ్.. మేమూ తియ్యగలం: పవన్కు మాస్ వార్నింగ్
అమరావతి: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన యువ శక్తి సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ అటాక్స్ మొదలయ్యాయి. ఆ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు తమ విమర్శలకు పదును పెట్టారు. మాటల తూటాలను పేల్చుతున్నారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, ఆరోపణలకు ధీటుగా స్పందిస్తోన్నారు.

వైఎస్ పేరు ప్రస్తావించడంపై
2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరఫున చేసిన ప్రచార కార్యక్రమాలను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించిన ఘనత తనకు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచెలు ఊడేలా తరిమి కొడతానని హెచ్చరించానని అన్నారు. తనను భయపెట్టాలని చూసినా, దాడులు చేసినా భయపడేది లేదని, ఎదిరించి నిలుస్తానని పేర్కొన్నారు.

మళ్లీ చెప్పుల భాష..
తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే- తన జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతానని, వీర మహిళ చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనను ఇలా దుర్భాషలాడే వారిని, ఎప్పటికీ మర్చిపోనని, జన సైనికులు కూడా మర్చిపోరని, అన్నీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు.

వైఎస్సార్ పంచెపోగును కూడా ముట్టుకోలేకపోయాడు..
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. 2009లో వైఎస్సార్ పంచెకు ఉన్న దారంపోగును కూడా పవన్ కల్యాణ్ ముట్టుకోలేకపోయాడని అన్నారు. 2009 నుంచి 2014 వరకు పవన్ కల్యాణ్ అడ్రస్ లేకుండా పోయాడని ధ్వజమెత్తారు. సినిమా మత్తులో సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి డబ్బా మాటలతో జన సైనికులను మభ్య పెట్టొచ్చేమో కానీ జనాలను కాదని తేల్చిచెప్పారు.

దేవుడు కూడా కాపాడలేడు..
పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు మత్తులో మునిగిపోయాడని, ఆయనను దేవుడు కూడా కాపాడలేడని పేర్ని నాని అన్నారు. బహిరంగ సభలో చెప్పుల భాష మాట్లాడే పవన్ కు సంస్కారం ఎక్కడుందని పేర్కొన్నారు. తన వద్దా రెండు చెప్పులున్నాయని, తాను వాటిని తీయగలనని హెచ్చరించారు. చెడిపోయిన వ్యక్తిత్వంతో రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదని పేర్కొన్నారు.

నమ్మి వచ్చిన జనాన్ని కూడా మోసం..
పవన్ కల్యాణ్ పై నమ్మకంతో వచ్చిన ప్రజలను కూడా పవన్ కల్యాణ్ మభ్యపెడుతున్నాడని పేర్నినాని పేర్కొన్నారు. నమ్మి వచ్చిన జనాలను ఆడిపోసుకుంటోన్నాడని, తనను ఓడించింది వారేనని చులకనగా చూస్తోన్నాడని ధ్వజమెత్తారు. ఒక పార్టీతో సతీ సంబంధాన్ని కొనసాగిస్తూ- మరో పార్టీకి కన్ను కొట్టి కాలు గీకుతున్నావంటూ మండిపడ్డారు. ఇష్టానుసారంగా పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేస్తోన్న పవన్ కల్యాణ్ అసలైన మూడు ముక్కల రాజకీయ నాయకుడని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications