లగడపాటి సైలెంట్గా లేడు.. సర్వే చేస్తున్నాడు ! ఫలితాలు చెప్పే డేట్ కూడా ఫిక్స్ చేశాడు
Recommended Video

తిరుపతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విడిపోయిన తరువాత గానీ ఎన్నికలు వచ్చాయంటే.. అందరి దృష్టీ నిలిచేది.. లగడపాటి రాజగోపాల్ మీదే. కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగి, రెండుసార్లు లోక్ సభకు ఎన్నికైన లగడపాటి రాజగోపాల్ ప్రకటించే సర్వేలు దాదాపు నిజమౌతాయనే విశ్వాసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొని ఉండేది. మళ్లీ ఎన్నికలొచ్చాయి. మరో రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో తొలి దశ పోలింగ్ నిర్వహించబోతున్నారు. లగడపాటి సర్వే మీద మాత్రం ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదని తెలుస్తోంది.
దీనికి కారణం- గత ఏడాది నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ముందస్తు సర్వే ఫలితాలు అతి దారుణంగా విఫలం కావడమే. ఆయన వేసిన అంచనాలో ఏ ఒక్కటి కూడా వాస్తవ ఫలితాలకు సరిపోలలేదు. ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అతి దారుణంగా ఓటమి పాలవుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కనీసం 10 స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు. వాటిల్లో ఏ ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు. తలకిందులయ్యాయి. ఆ తరువాత- లగడపాటి వెల్లడించే సర్వేలు ప్రజల్లో చాలామటుకు విశ్వాసం కోల్పోయింది.

బెట్టింగ్ రాయుళ్ల కోసమే సర్వే చేశారనే ఆరోపణలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి ప్రకటించిన ఒకే ఒక్క సర్వే.. దశాబ్దాల పాటు ఆయనపై ఉన్న విశ్వాసాన్ని పటాపంచలు చేసేసింది. తెలంగాణ విషయంలో ఆయన అంచనాలన్నీ బోల్తా కొట్టాయి. ఒక్క ఫలితం కూడా ఆయన చెప్పినట్టుగా రాలేదు. బెట్టింగ్ రాయుళ్ల కోసమే లగడపాటి ఎన్నికల ఫలితాలపై తప్పుడు సర్వే చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ గెలుస్తుందంటూ ప్రకటించడం వల్ల ఆ పార్టీపై పెద్ద ఎత్తున పందేలు కాశారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని తెలిసి కూడా తప్పుడు సర్వే వెల్లడించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ తరఫున పందెం కాసిన వారి నుంచి లగడపాటి పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నారనే వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

నేషనల్ మీడియా సర్వేలివీ..
ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చాయి. తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాలతో సహా 175 అసెంబ్లీ సీట్లకూ ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ స్థాయి వార్తా ఛానళ్లు నిర్వహించిే సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ మొత్తం 20 నుంచి 22 సీట్లను దక్కించుకుంటుందని, టీడీపీ మూడు నుంచి అయిదు నియోజకవర్గాలకే పరిమితమౌతుందని చెబుతున్నాయి. నేషనల్ మీడియా సంస్థలన్నీ దాదాపు ఇదే విషయాన్ని వెల్లడించాయి.

లగడపాటి ఏం చెబుతున్నారంటే..
ఈ నేపథ్యంలో- లగడపాటి రాజగోపాల్ సర్వే వ్యవహారం మరోసారి చర్చల్లోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలుగు ప్రజలు అనుభవానికి పట్టం కడతారని లగడపాటి చెప్పుకొచ్చారు. అనుభవం, సమర్థుడైన నాయకుడినే ఎన్నుకుంటారని ఆయన అన్నారు. ఇందులో మరో మాటకు అవకాశం లేదని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన పరోక్షంగా వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలపై తాను ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నానని, ఫలితాలను మాత్రం ఇప్పట్లో వెల్లడించబోనని అన్నారు. దేశంలో వచ్చేనెల 19వ తేదీన తుదిదశ పోలింగ్ ముగుస్తుందని, అదే రోజు సాయంత్రం తాను సర్వే ఫలితాలను ప్రకటిస్తానని లగడపాటి చెప్పారు.

కాలినడకన తిరుమలకు..
శ్రీవారిని దర్శించుకోవడానికి సోమవారం ఉదయం ఆయన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. మెట్లమార్గంలో తిరుమలకు వెళ్తున్న ఆయనను తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా స్పష్టమైన తీర్పునే ఇచ్చారని లగడపాటి అన్నారు. గజిబిజి ఫలితాలను ఎప్పుడూ ఇవ్వలేదని, ఒకే పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకత్వాన్ని కోరుకున్నారని లగడపాటి చెప్పారు. దూరాలోచనతో, దూరదృష్టితో పరిపాలించే వారిని ఎన్నుకుంటారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును, వాటి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు ప్రజలు సమర్థుడైన నాయకుడిని ఎన్నుకుంటారని తాను నమ్ముతున్నట్లు లగడపాటి చెప్పారు.

టీడీపీలో చేరబోయి.. చివరి నిమిషంలో
ప్రస్తుతం లగడపాటి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుని పోయింది. దీనితో ఆయన కూడా రాజకీయాలకు కూడా విరామం ప్రకటించారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావు పేట లోక్ సభ స్థానం నుంచి లగడపాటిని బరిలో దించడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. విజయవాడ లేదా నరసరావు పేట లోక్ సభ స్థానాల్లో ఏదైనా ఒకదాన్ని తనకు కేటాయిస్తే.. పార్టీలో చేరడానికి తనకు అభ్యంతరం లేదని లగడపాటి అప్పట్లో సంకేతాలు కూడా పంపించారు. విజయవాడలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఉండటంతో కుదరదన్న చంద్రబాబు.. నరసరావు పేట సీటును ఆయనకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివ రావును తప్పించి, లగడపాటికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చివరి నిమిషంలో- రాయపాటి తిరుగుబాటు చేయడం, తనకు టికెట్ ఇవ్వకపోతే.. పోలవరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి బాగోతాన్ని బయటపెడతానంటూ చంద్రబాబును బెదిరించారు. మరో మార్గం లేక చంద్రబాబు లగడపాటిని కాదని రాయపాటికే టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications