పండగ వేళ విషాదం : తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సంక్రాంతి పండగ వేళ తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రావులపాలెం సమీపంలోని రావులపాడు రోడ్డు వద్ద రెండు కార్లు ఢీకొనడంతో.. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులను పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.విజయవాడ వైపు వెళ్తున్న కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జవ గా.. ఓ కారుకు చెందిన ఇంజన్ ఏకంగా బయటకు ఊడి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి తానేటి వనిత కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రి కాన్వాయ్ భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం దగ్గరి నుంచి వెళ్తుండగా ఓ వృద్దుడి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ అదుపు తప్పగా.. మంత్రి వాహనం డివైడర్ను కొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ ఆ వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని కలసూరి వెంకటరామయ్యగా గుర్తించారు. వెంకటరామయ్య మృతితో పండగ పూట అతని కుటుంబంలో విషాదం నెలకొంది.