ఎన్డీఏను శాసించిన చంద్రబాబు, నేడు పవన్ రాయబారం - సెల్ఫ్ గోల్..!!
45 ఇయర్స్ ఇండస్ట్రీ. 14 ఏళ్లు ముఖ్యమంత్రి. మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేత. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర. ఇదీ క్లుప్తంగా చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు తాను కన్వీనర్ గా చక్రం తిప్పిన కూటమి లోనే రివర్స్ అయింది. పవన్ కల్యాణ్ అదే కూటమిలో ఇప్పుడు చంద్రబాబు కోసం రాయబారం చేస్తున్నారు. చంద్రబాబు కు రాజకీయంగా ఎందుకీ పరిస్థితి వచ్చింది. టీడీపీలో ఏం చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది.
ఎన్డీఏ కన్వీర్ గా చంద్రబాబు : జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఏర్పాటు నుంచి జాతీయ రాజకీయాల్లో..నిర్ణయాల్లో చంద్రబాబు శాసించారు. 1998 లో ఏర్పాటైన ఎన్డీఏ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాని వాజ్ పేయ్ తో కలిసి..ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాడు కీలక పాత్ర పోషించారు. పార్టీలను ఏక తాటి పైకి తీసుకురావటం..

రాష్ట్రపతి సహా పలు కీలక ఎంపికల్లో ఏకాభిప్రాయ సాధనలోనూ ముఖ్య భూమిక వహించారు. 2014లో తిరిగి మోదీతో కలిసి పని చేసారు. అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటంతో అధికారం దక్కించుకొనేందుకు నేరుగా పవన్ ఇంటికి వెళ్లారు. అటు మోదీ...ఇటు పవన్ తో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు అంతా తానైన నడిపించిన ఎన్డీఏ లో ఇప్పుడు స్థానం లేదు.
2018వేళ నిర్ణయాలతోనే : 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాత...కొత్త మిత్రులను బీజేపీ ఆహ్వానించింది. టీడీపీకి మాత్రం పిలుపు రాలేదు. పవన్ కల్యాణ్ ను ఆహ్వానం రావటంతో హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ భర్తీ చేసే బాధ్యత పవన్ తీసుకున్నారు.

ఎన్డీఏ ఏర్పాటు నుంచి అధికారంలో కలిసి నడిపించిన ఎన్డీఏలో టీడీపీ స్థానం కోసం పవన్ ప్రయత్నించటం ఆసక్తి కర చర్చగా మారింది. ఏపీలో గెలవాలంటే టీడీపీ ఖచ్చితంగా బీజేపీ మద్దతు తీసుకోవాల్సిందేనా అనే సందేహం మొదలైంది. బీజేపీ వైఖరి స్పష్టం అవుతున్నా..ఇంకా టీడీపీ పవన్ ద్వారా ఈ ప్రయత్నాలు ఎందుకనే చర్చ టీడీపీ సీనియర్లలో మొదలైంది.
2019లో వైఫల్యం : ఎన్డీఏలో టీడీపీకి అవకాశం ఇప్పటి వరకు దక్కలేదు. దక్కుతుందా లేదా అనేది కాలమే తేల్చాలి. అయితే, 2018 లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత నాడు చంద్రబాబు ప్రధాని మోదీ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మోదీని ఓడించేందుకు తమ పార్టీ ఏర్పాటు సిద్దంతానికి భిన్నంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఇంటికి వెళ్లి చేతులు కలపటం చంద్రబాబు చేసిన పెద్ద తప్పుగా ఇప్పటికీ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి కేంద్రంలో ఏ పార్టీతోనూ దగ్గర కాలేకపోయారు. ఏపీలోనూ అధికారం కోల్పోయారు.

పవన్ రాయబారం : ఇప్పుడు పవన్ టీడీపీ కోసం బీజేపీ ముఖ్యులతో రాయబారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ మరోసారి అధికారంలోకి రావటం అవసరమని చెబుతున్న పవన్..రానున్న రోజుల్లో టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత సాధ్యం కాకుంటే ఎవరితో ఉంటారనేది మరో సందేహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఒక విధంగా వైసీపీ వర్సస్ పవన్ అన్నట్లుగా రాజకీయం మారుతోంది. టీడీపీ యాక్టివిటీ కొంత కాలంగా తగ్గింది. పవన్ వారాహి యాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఈ సమయంలో పవన్ ఆధారంగా టీడీపీ రాజకీయం చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి..చంద్రబాబు ఏం చేస్తారు..ఇంకా బీజేపీ వైపే చూస్తారా.. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications