తెలంగాణ పల్లెల్లో గద్దర్: పల్లెదర్శనం పేరుతో జనంలోకి..
కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడిప్పుడే చిన్న చిన్నమార్పులు వస్తున్నట్లు గమనిస్తున్నానని గద్దర్ ఈ సందర్బంగా అన్నారు.
యాదాద్రి: ప్రజా యుద్దనౌక గద్దర్ పల్లెదర్శనం పేరుతో తెలంగాణవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడిప్పుడే చిన్న చిన్నమార్పులు వస్తున్నట్లు గమనిస్తున్నానని గద్దర్ ఈ సందర్బంగా అన్నారు. మహిళా రిజర్వేషన్ ద్వారా మండల కేంద్రంలో సర్పంచ్గా ఎన్నికైన అంగడి నవనీత ఇంటిని సందర్శించి ఆర్థిక సమస్యలపై ఆమె కుటుంభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానరు.
అంతకుముందు పబ్లిక్ హెల్త్ సెంటర్ ను సందర్శించిన గద్దర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ చంద్రారెడ్డితో షుగర్, బీపీ టెస్టులు చేయించుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రి అంతా కలియతిరుగుతూ రోగులను పరామర్శించారు.
ఆపై సీతారమాలింగేశ్వరాలయాన్ని, స్థానిక రేషన్ షాపును సందర్శించారు. రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఇస్తుండటంపై నిర్వాహకులను ప్రశ్నించగా.. సన్నబియ్యం రావడం లేదని వారు సమాధానం చెప్పారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్ను సందర్శించి శాంతిభద్రతల పరిరక్షణ, పలు అంశాలపై వివరాలు అడిగారు.
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) కింద ఇక్కడ ఫిర్యాదులు చేయవచ్చా? అని ఎస్ఐని గద్దర్ అడిగారు. పోలీస్ అధికారి బదులిస్తూ యాదగిరిగుట్టలోని సీఐ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.