మా పాఠశాలే, అందుకే ఎన్టీఆర్, బాబు బాటలో: కెసిఆర్పై గాలి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ను టీడీపీలో శిక్షణ పొందిన నేతగానే అభివర్ణించారు.
'కేసీఆర్ తెలుగుదేశం పాఠశాలలో చదువుకున్నారు. ఇక్కడే శిక్షణ పొందారు. ఆ వారసత్వం కాబట్టే టీడీపీ అమలు చేసిన కార్యక్రమాలనే అమలు చేస్తున్నారు. ముస్లిం విద్యార్థుల కోసం వంద పాఠశాలలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ పాఠశాలలకు ఆద్యుడు ఎన్టీఆరే. చంద్రబాబు కూడా గతంలో షాదీఖానాలు, దర్గాలు, మసీదుల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులిచ్చారు' అని ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో కర్ఫ్యూలు, మత ఘర్షణలు ఉండేవని, టీడీపీ హయాంలో వాటిని పూర్తిగా నిర్మూలించి శాంతి భద్రతలు నెలకొల్పడం వల్లే ఐటీ కంపెనీలు, అనేక పరిశ్రమలు వచ్చి హైదరాబాద్ అభివృద్ధి అయిందని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీని స్థాపించకముందు కెసిఆర్.. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో మంత్రిగానూ విధులు నిర్వహించారు కెసిఆర్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి.. తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీని స్థాపించి విజయవంతయ్యారు.