కెటిఆర్ లేదా కవిత సిఎం, హరీశ్ని వాడుకుని వదిలేస్తారు: గాలి జోస్యం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు త్వరలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి కెసిఆర్ తప్పుకుంటే ఆయన కుమారుడు కెటి రామారావు లేదా కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ పదవిని చేపడతారని అన్నారు. మేనల్లుడు హరీశ్ రావును కెసిఆర్ వాడుకుని వదిలేస్తారని ఆయన అన్నారు.
రావణాసురుడు, నరకాసురుడు, హిరణ్యకశ్యపుడిలా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం కెసిఆర్, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఏపికి పట్టిన రాక్షసులని గాలి ముద్దుకృష్ణమ ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు పాటించాలి
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విద్యుత్ ఉద్యోగులను తొలగించిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రామ్మాహన్నాయుడు అన్నారు. సెక్షన్ 8 అములులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. విధుల నుంచి తొలంగించబడిన తెలంగాణ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ధర్నా చేశారు. ఈ దీక్షకు ఆంధ్ర్రప్రదేశ్ ఎంపీలు సంఘీభావం తెలిపారు.