‘‘జయదేవ్ ఓ విజిటింగ్ ప్రొఫెసర్.. ఏం సాధించారని సన్మానం?’’
కాకినాడ: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. టీడీపీ తమకు కటీఫ్ చెప్పినా పర్వాలేదంటూ లైట్ తీసుకుంటున్నారు.
Recommended Video
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్, యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేస్తున్నారని ప్రశ్నించారు.
గుంటూరులో ఆయన్ని విజిటింగ్ ప్రొఫెసర్ అని పిలుస్తారంటూ ఎద్దేవా చేశారు. అవకాశమొస్తే తాము జయదేవ్ కంటే బాగా మాట్లాడగలమన్నారు. టీడీపీ నాయకులు.. బీజేపీ నాయకులను బెదిరించాల్సిన అవసరం లేదన్నారు.
'మాతో రాంరాం అనుకుటే మేమూ రాంరామే. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటూ మేమూ చేస్తాం. మా దగ్గర కూడా ఆయుధాలున్నాయి. టీడీపీ నేతలు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా మృదువుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది..' అని కృష్ణమోహన్, రాంప్రసాద్ వ్యాఖ్యానించారు.