కాల్వలో గాంధీ విగ్రహం: గాడ్సే అంటూ బాబుపై అంబటి నిప్పులు
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని కేంద్రమంత్రి వెంకయ్య చెప్పడం సరికాదని అంబటి అన్నారు.
విదేశీ మోజులో పడిన ఏపీ సీఎం చంద్రబాబు మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారని దుయ్యబట్టారు. దేవాలయాలు, విగ్రహాలను కూల్చే గాడ్సే.. చంద్రబాబు అని మండిపడ్డారు.
అంతకుముందు బొత్స మాట్లాడుతూ... క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ అని నినదించారు. గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ చర్యకు పాల్పడిన జిల్లాస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లోని గాంధీజీ విగ్రహాన్ని తొలగించారు. ఆ విగ్రహం ఎక్కడ ఉందని వెతకగా.. పలువురికి అది కాల్వలో కనిపించినట్లుగా చెబుతున్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి.
దీంతో తిరిగి దానిని రింగ్ సెంటరులోనే ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని కాల్వలో పడేయడంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన గాంధీ విగ్రహాన్ని పరిశీలించారు.
వందల కోట్ల రూపాయలతో చేస్తున్న కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యత లేదన్నారు. కాగా, మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని వైసిపి నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పార్థసారధి, జోగి రమేషఖ్ తదితరులు పరిశీలించారు.