చెత్త వాహనాల్లో గణేశ్ విగ్రహాల తరలింపు... వైసీపీ పాలనలో మితిమీరుతున్న అరాచకాలు : జనసేన
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రోజురోజుకు అరాచకాలు మితిమీరిపోతున్నాయంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని రెజిమెంట్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రోడ్డు పక్కన విక్రయిస్తున్న గణేశ్ విగ్రహాలను చెత్త తరలించే వాహనంలోకి ఎక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడే ఉన్న ఓ అధికారితో కొంతమంది వ్యక్తులు గొడవపడటం కనిపిస్తోంది.
'అత్యంత పవిత్రంగా పూజించే విఘ్నేశ్వరుని ప్రతిమలను చెత్త తరలించే వాహనాల్లో తరలించటమా? ఇది అత్యంత దుర్మార్గపు చర్య. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న అరాచకాలు.' అంటూ జనసేన శతఘ్ని రెజిమెంట్ దీన్ని షేర్ చేసింది. అయితే ఇది ఎక్కడ,ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.ఈ నెల 10న గణేశ్ చతుర్థి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ విగ్రహాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన విక్రయిస్తున్న గణేశ్ విగ్రహాలను అక్కడి నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో రోడ్ల అద్వాన్న స్థితిపై జనసేన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపింది. #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ పేరుతో నిర్వహించిన ఈ క్యాంపెయిన్లో వేలాది మంది ప్రజలు రోడ్ల దుస్థితిని తెలియజేసే ఫోటోలను షేర్ చేశారు. ఈ ఎఫెక్టుతో ప్రభుత్వం రోడ్లపై ఫోకస్ చేయక తప్పలేదు. అక్టోబర్ నెలాఖరులో వర్షాలు తగ్గాక దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు టెండర్లు పిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.
అక్టోబర్ నెలాఖరు తర్వాత టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుందని.. ఇక పనులెప్పుడు పూర్తవుతాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వం పనులు ప్రారంభించేవరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి కావచ్చని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ రోడ్లపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రోడ్ల దుస్థితిపై జనసేన చెప్తేగానీ కళ్లు తెరవరా..? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
'ప్రతీ జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించుకొని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను. ఏ రోడ్డు ఎన్ని కిలో మీటర్ల మేర దెబ్బ తిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తరవాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది.' అని పవన్ ట్విట్టర్ ద్వారా జనసైనికులకు సూచించారు.
అత్యంత పవిత్రంగా పూజించే విఘ్నేశ్వరుని ప్రతిమలను చెత్త తరలించే వాహనాల్లో తరలించటమా? ఇది అత్యంత దుర్మార్గపు చర్య. @YSRCParty ప్రభుత్వం హయాంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న అరాచకాలు. pic.twitter.com/gt0Be7ef4d
— JanaSena Shatagni (@JSPShatagniTeam) September 6, 2021












Click it and Unblock the Notifications