గ్యాంగ్ ఆఫ్ ఫోర్: పగలు పేకాట, ఏడాదిలో 48 చోరీలు
అనంతపురం: నలుగురు వ్యక్తులు ఓ ఏడాదిలో 48 దొంగతనాలకు పాల్పడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురు జల్సారాయుళ్లు పగలంతా పేకాట ఆడుతూ రాత్రుళ్లు దొంగతనాలు చేస్తూ వస్తున్నారు. వ్యసనాల కోసం వారు చోరీలకు అలవాటు పడ్డారు. ఏడాదిలో 48 దొంగతనాలు చేశారు. పోలీసులు వలవేసి వారిని పట్టుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్లకు చెందిన పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి, రొద్దం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అలియాస్ శీనా, కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన ఎరికల గంగన్న అలియాస్ పాచి గంగడు, కంబదూరుకు చెందిన ఎరికల సోమశేఖర్ జులాయిగా తిరుగుతూ ఉండేవారు.
ముఠాలో పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి కీలక సూత్రదారి, పాత్రదారి కూడా. ఇతను తాగుడు, పేకాట, కోడి పందేలు తదితర జూదాలకు అలవాడు పట్టాడు. తాడిపత్రి, గోరంట్ల ప్రాంతాలకు వెళ్లి తరచూ జూదాలు ఆడేవాడు. ఈ క్రమంలో తక్కిన ముగ్గురు నిందితులు ఇతనికి పరిచయమయ్యారు. వీరు కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వారే కావడంతో త్వరగా జట్టుకట్టగలిగారు. సులువుగా డబ్బులు సంపాదించడానికి దొంగనాలు షురూ చేశారు.
ఎవరూ లేని సమయంలో అదునుచూసి పగలు-రాత్రి తేడా లేకుండా ఇళ్ల తాళాలను పగలకొట్టి లోపలికి ప్రవేశిస్తారు. ఇంట్లో దాచిన విలువైన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్తారు. వీటితోపాటు ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలు, పురుషులను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్ళడం వీరు చేసే పని. అనంతపురం నగరంతో పాటు రాప్తాడు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, కసాపురం, పాల్తూరు, తాడిపత్రి, కనగానపల్లి, ఉరవకొండ, గోరంట్ల, గుంతకల్లు, లేపాక్షి, గార్లదిన్నె, గుత్తి, కూడేరు, ధర్మవరం, యాడికి, హిందూపురం, తాడిమర్రి, విడపనకల్లు, రాయదుర్గం, కుందుర్పి, పెద్దవడుగూరు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు.
ఎస్పీ రాజశేఖర్బాబు ఆదేశాలతో అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు జి.రాజశేఖర్, ఆనందరావు, అశోక్రెడ్డి, శుభకుమార్, ఎస్ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్రెడ్డి, జి.రాజు, జనార్దన్నాయుడు, ఏఎస్ఐలు సాదిక్బాషా, అంజాద్వలి, వరలక్ష్మి సిబ్బందితో బృందాలకు ఏర్పడ్డారు. ఎట్టకేలకు వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.11 కిలోల బంగారం నగలు, 7 కిలోల వెండి ఆభరణాలు, రూ. 36లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.