వైసీపీలోకి గంజి చిరంజీవి - లోకేశ్ పై పోటీ చేస్తారా : సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏంటి..!!
సీఎం జగన్ ఆపరేషన్ మంగళగిరి మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కుప్పం మీద ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు మంగళగిరిలోనూ కొత్త పావులు కదుపుతున్నారు. అక్కడ చంద్రబాబు తనయుడు లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజధాని పరిధిలోని మంగళగిరి..తాడికొండ నియోజకవర్గాలు సీఎంకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తాడికొండలో పార్టీకి రిపేర్లు మొదలు పెట్టారు. ఇటు..మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే పోటీ పైన సందిగ్ధత కొనసాగుతోంది.

మంగళగిరిలో సీఎం కొత్త సమీకరణాలు
దీంతో..ఈ సారి అక్కడ లోకేష్ పైన బీసీ కార్డు ప్రయోగించేందుకు ముందస్తు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే బీసీ చేనేత వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి.. నిన్న మొన్నటి వరకు అదే పార్టీలో కొనసాగిన గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత వర్గం ప్రాబల్యం ఎక్కువ. గత ఎన్నికల సమయం నుంచి లోకేష్ తో పాటుగానే గంజి చిరంజీవి నియోజకవర్గంలో పని చేసారు. కానీ, కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరుతానని వెల్లడించారు.

లోకేష్ పోటీ చేస్తే..బరిలోకి బీసీ అభ్యర్ధి
ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సమక్షంలో సీఎం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గంజి చిరంజీవి చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైసీపీ కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిపడ్డారు. నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజికవర్గానికి టీడీపీలో గౌరవం లేదని విమర్శించారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు.

రాజధాని ప్రాంతంపై వ్యూహాత్మకంగా
ఎన్టీఆర్ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని దుయ్యబట్టారు. అయితే, ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కు సంబంధించి పార్టీ నేతలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ, సీఎం జగన్ మాత్రం ముందు పార్టీలో పని చేయాలని.. అందరినీ కలుపుకు వెళ్లాలని మాత్రమే సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. నారా లోకేష్ ఇప్పటికే తాను వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచి.. తన తండ్రికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు..వైసీపీ అక్కడ నుంచి ఆర్కే స్థానంలో బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గంజి చిరంజీవి వైసీపీతో టచ్ లో ఉంటూ తమ పార్టీలో కోవర్ట్ గా పని చేసారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ పోటీకి దిగటం ఖాయమైతే..అక్కడ వైసీపీ నుంచి బీసీ అభ్యర్ధి రంగంలోకి దిగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications