అమరావతికి గన్నవరమే గేట్వే: ఎయిర్ పోర్టు నుంచి రాజధానికి 6లైన్ వే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గేట్వేగా సీఆర్డీఏ పరిధిలోని గన్నవరం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. గన్నవరంలో ఎయిర్పోర్టు ఉండటంతో దీనికి అభిముఖంగా రాజధానికి ప్రవేశద్వారం కల్పించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని అత్యద్భుత ఆర్కిటెక్ట్ నైపుణ్యంతో కూడిన గ్రాండ్ఎంట్రన్స్ను ఇక్కడ ఏర్పా టు చేయబోతున్నారు.
అద్భుతంగా నిర్మించనున్న ముఖద్వారం నుంచి ఆరు వరుసల భారీ రహదారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇంకా మార్కింగ్ పనులు ప్రారంభం కాలేదు. ఎయిర్పోర్టు ఎదుట వెటర్నరీ కళాశాల ఉన్నందున దీని పక్కన అయినా, లేదా మరోచోటుకు దీనిని తరలించయినా విమానాశ్రయానికి అభిముఖంగా గేట్వే నిర్మించాలని ఏపి ప్రభుత్వం భావిస్తోంది.
ఇక్కడి నుంచి విజయవాడ శివారు మీదుగా భూసేకరణ జరపటం కూడా తేలిగ్గా ఉంటుందని భావిస్తోంది. అమరావతి రాజధానికి, ముఖ్యంగా సీడ్ క్యాపిటల్కు చాలా త్వరగా చేరుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇబ్రహీంపట్నం వరకు ఆరు వరుసల రహదారిని ఏర్పాటు చేయనున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కృష్ణానది మీదుగా సీడ్ క్యాపిటల్కు చేరుకోవాల్సి ఉంటుంది.

ఆరు వరుసల రహదారిని కృష్ణానదిపై ఉన్న ఐకాన్ బ్రిడ్జికి అనుసంధానం చేస్తారు. సీడ్ క్యాపిటల్ వరకు ఐకాన్ బ్రిడ్జి ఉంటుంది. తిరిగి మళ్లీ ఈ ఐకాన్ బ్రిడ్జి ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి చినకాకాని వరకు ఆరు వరుసల రహదారిని పొడిగిస్తారు. చినకాకాని దగ్గర భారీ జంక్షన్ను అభివృద్ధి చేస్తారు.
ఎయిర్పోర్టు నుంచి గన్నవరం గేట్వే వరకు ఆరు వరుసల రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ ఇంకా దీనికి సంబంధించి సర్వే పనులు మొదలు కావాల్సి ఉంది. త్వరలోనే సర్వే పూర్తిచేసి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది.
అమరావతికి సమీపంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి అక్కడ్నుంచే వారంలో మూడు రోజులుపాటు పాలనను కొనసాగించాలని ఇప్పటికే ఏపి సిఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఇందుకోసం సుమారు 20వేల మంది ఉద్యోగులను కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications