జగన్ ఉన్మాదానికి అదే కారణం, అక్కడైతే రోజుకోసారి ఉరే: గంటా, బుద్ధా నిప్పులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరచరిత్ర అనేది జగన్ డీఎన్ఏలోనే ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరచరిత్ర అనేది జగన్ డీఎన్ఏలోనే ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని, వెంటనే అతడ్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు.

ఆ డీఎన్ఏ ఉంటే అంతే..
జగన్ వాడుతున్న బాషను ఎవరూ వాడలేరని తెలిపారు. జగన్ తాత రాజారెడ్డి, తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే వారి కుటుంబంలోని అందరి డీఎన్ఏ ఇదేనని అన్నారు. ఆ డీఎన్ఏ ఉన్నవారికి ఇలాంటి భాషే వస్తుందని ఎద్దేవా చేశారు.

వెంటనే పిచ్చాసుపత్రికి తరలించాలి..
జగన్ ప్రస్తుత స్థితిని చూసి ప్రతి ఒక్కరూ జాలి పడాల్సిన పరిస్థితి ఉందని, ఆయన మెంటల్ కండిషన్ ఏ మాత్రం బాగోలేదని ఎద్దేవా చేశారు. మానసిక స్థితి సరిగా లేకపోతే మనుషులు ఉన్మాదులుగా తయారవుతారని.. అందుకే ఇప్పుడు జగన్ కూడా అలాగే తయారయ్యారని అన్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డికి తమ విశాఖపట్నంలోని మెంటల్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని అన్నారు.

అదో కామెడీ షో
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జగన్ చేపట్టిన రోడ్ షో కామెడీ షోలా సాగుతోందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో శుక్రవారం తన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అక్కడైతే జగన్ను రోజుకోసారి ఉరితీసేవారు
ఈ సందర్భంగా జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ అని, ఇండియాలో కాబట్టి 16నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారని.. అదే అరబ్ దేశాల్లో అయితే.. ఆయన్ను రోజుకొకసారి ఉరితీసేవారని బుద్ధా వెంకన్న అన్నారు.












Click it and Unblock the Notifications