క్రిమినల్ చర్యలే: కాలేజీలకు గంటా హెచ్చరిక, ‘మల్టీనేషనల్ కంపెనీలా డీజీపీ ఆఫీస్’
కాలేజీల్లో ఆత్మహత్యలు జరిగితే యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.
అమరావతి: కాలేజీల్లో ఆత్మహత్యలు జరిగితే యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో సోమవారం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు భేటీ అయ్యాయి.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ... అన్ని కాలేజీలు ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాలని చెప్పారు. అక్టోబర్ 20 నుంచి ప్రైవేట్ కాలేజీలు, హాస్టళ్లలో తనిఖీలు చేస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా చదివించాలని కోరుతున్నామని అన్నారు.
158 కార్పొరేట్ కాలేజీల హాస్టళ్ల నిర్వహణకు అనుమతి తీసుకోలేదని.. 3 నెలల్లోగా అన్ని హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. లేకుంటే హాస్టళ్లను మూసివేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి గంటా పేర్కొన్నారు.
మల్టీ నేషనల్ కంపెనీలా డీజీపీ ఆఫీస్: గంటా
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఓ మల్టీనేషనల్ కంపెనీలా అద్భుతంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తాను డీజీపీ కార్యాలయానికి రావడం ఇదే తొలిసారని చెప్పారు. విద్యకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 21న కూడా పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుతామని, విధుల్లో భాగంగా మరణించిన పోలీసులకు ఆరోజు నివాళులర్పిస్తామని చెప్పారు. స్టేషన్లకు పౌరులను పిలిచి వారికి ఆయుధాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.