సీఎం జగన్ బలవంతుడా-బలహీనుడా : వారు టీడీపీలోకి వస్తారు : గంటా కీలక వ్యాఖ్యలు..!!
మాజీ మంత్రి..టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు చిన్న గ్యాప్ తరువాత మరోసారి రాజకీయంగా తెర మీదకు వచ్చారు. ఈ సారి ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణ లక్ష్యంగా ఆయన విమర్శలు చేసారు. సీఎం జగన్ బలవంతుడు కాదు..బలహీనుడని కేబినెట్ విస్తరణతో తేలిపోయిందని గంటా వ్యాఖ్యానించారు. కేబినెట్ కూర్పుపై దిష్టిబొమ్మల దగ్డం..టైర్లు కాల్చుతూ ఆందోళనలు చేయటం తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో తొల సారి చూస్తున్నానని చెప్పుకొచ్చారు. కొత్త కేబినెట్ లో ఎక్కడా సమతుల్యత లేదని వ్యాఖ్యానించారు.

వైసీపీని బీసీలు నమ్ముతారా
ఎన్నికలకు రెండేళ్ల ముందు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామంటే బీసీలు వైసీపీని నమ్ముతారా అని గంటా ప్రశ్నించారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు చేసినా..బీసీలు ఎప్పుడూ టీడీపీతోనే ఉంటారనంటూ ధీమా వ్యక్తం చేసారు. కొన్ని అంశాల నుంచి డైవర్ట్ చేయటం కోసమే ఆకస్మికంగా ఎటువంటి కసరత్తు లేకుండా జిల్లాల విభజన పూర్తి చేసారని దుయ్యబట్టారు. జగన్ జిల్లాల విషయంలో తీసుకున్న నిర్ణయాల పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిరసనలు చేసారని గంటా చెప్పుకొచ్చారు. కొత్త కేబినెట్ తో సాధించింది ఏమీ లేదన్నారు. ఇక, 26 జిల్లాలు ఏర్పాటు చేసామని గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం..విశాఖ..విజయవాడ..తిరుపతి సహా 8 జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని విశ్లేషించారు.

విశాఖకు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో
ఏపీలో పెద్ద నగరమైన విశాఖకు మంత్రి పదవి ఇవ్వకపోవటం సరి కాదన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే పొత్తులు..సర్దుబాట్లు అంశం పైన చర్చలు ఉంటాయని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పుల గురించి సైతం సరైన కసరత్తు లేకుండానే నిర్ణయాలు చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రులు.. కొందరు ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తాజాగా చేసిన విద్యా శాఖ సమీక్షలో మంత్రి బొత్సా ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత త్వరలోనే పార్టీ పరంగా చేపట్టే కార్యాచరణ ప్రకటిస్తారని గంటా చెప్పారు.

గంటా టీడీపీతోనే కంటిన్యూ అవుతారా
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన గంటా..కొద్ది రోజుల క్రితం తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ కు లేఖ రాసారు. గంటా కాపు నేతల సమావేశాల్లోనూ వరుసగా హాజరవుతున్నారు. దీంతో..ఆయన టీడీపీలో కొనసాగుతారా లేదా అనే చర్చ కొంత కాలంగా విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు తిరిగి టీడీపీకి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు గంటా వ్యవహారం మరోసారి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications