రిషికేశ్వరి ఘటనపై గంటా, సెలబ్రటీలతో ప్రచారం, రాజకీయ ఒత్తిళ్లని పార్థసారథి
విశాఖ: గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమని, ర్యాగింగ్కు వ్యతిరేకంగా సెలబ్రటీలతో ప్రచారం చేయిస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ రావు సోమవారం అన్నారు.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలోని ఆంధ్రా వర్సిటీలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ర్యాగింగ్ నిరోధానికి అవసరమైతే చట్టంలో మార్పులు చేస్తామన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్కు బలై ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదన్నారు.
ర్యాగింగ్ చేస్తే ఇక చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేలా చట్టంలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.

రిషికేశ్వరి మృతిపై న్యాయవిచారణ జరిపించాలి
రిషికేశ్వరి మృతి పైన సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పివోడబ్ల్యూ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక రైల్వే స్టేషన్ నుంచి లాడ్జి సెంటర్ వరకు నిరసన చేపట్టారు. ఈ కేసును త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, ప్రిన్సిపల్ బాబురావును ఏ1 ముద్దాయిగా చేర్చాలని, వర్సిటీల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
రిషికేశ్వరి మృతి కేసులో తాము గవర్నర్ను కలుస్తామని వైసీపీ నేత పార్థసారథి గుంటూరులో చెప్పారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యను గాలికి వదిలి రాజకీయ నాయకుల భజన చేస్తున్నారని మండిపడ్డారు. రిషికేశ్వరి కుటుంబానికి న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో న్యాయవిచారణ జరిపించాలన్నారు.












Click it and Unblock the Notifications